దేశంలో గుణాత్మక మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశమంతటా సంచలనం సృష్టిస్తున్నది. ఎక్కడచూసినా బీఆర్ఎస్ ముచ్చటే. అయితే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాల్సిన చారిత్రక సందర్భం, నేపథ్యాలను ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉన్నది.
రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని రాష్ర్టాల సమాఖ్యగా నిర్వచించారు. రాష్ర్టాలకు, కేంద్రానికి నిర్దిష్టంగా, వేర్వేరుగా శాసన పరిపాలన, ఆర్థిక అధికారాలు ఉండేలా చట్టాల రూపకల్పన చేశారు. దేశభద్రత, సమగ్రతను కాపాడటం, కరెన్సీ, విదేశీ వ్యవహారాల వంటి అంశాలు కేంద్రం పరిధిలోనివిగా గుర్తించారు. అధికారాలకు సంబంధించి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా రూపొందించారు. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాల మీద అంతిమ నిర్ణయాధికారం కేంద్రానిదే. రాష్ర్టాల మధ్య నీటి పంపిణీ వంటి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే. అత్యవసర పరిస్థితి వంటి విచక్షణాదికారం కేంద్రానిదే.
భారతదేశాన్ని కాంగ్రెస్, బీజేపీలు దాదాపు 75 ఏండ్లు పాలించాయి. ఈ రెండు పార్టీలు సమాఖ్యస్ఫూర్తిని కాపాడటంలో, దేశాన్ని అభివృద్ధి పథాన నడిపించడంలో దారుణంగా విఫలమయ్యాయి. యూనియన్ ఆఫ్ స్టేట్స్ను యూనిటరీ స్టేట్గా మార్చాయి. రాష్ర్టాలు వాటి ప్రతిపత్తిని కోల్పోయి కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది. ‘బలహీనమైన రాష్ర్టాలు- బలమైన కేంద్రం’ అనే ఎజెండాను అమలుచేశాయి. ఫలితంగా ఆయా రాష్ర్టాల ప్రజలు తమ అస్తిత్వ రక్షణ కోసం ప్రాంతీయ రాజకీయ శక్తులను ఆశ్రయిస్తున్నాయి. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయి. దీంతో దేశ రాజకీయాల్లో సంకీర్ణ శకం ప్రారంభమైంది.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా దేశంలో విద్యుద్దీకరణకు నోచుకోని గ్రామాలున్నాయి. మంచినీరు, రహదారులు లాంటి సౌకర్యాల్లేని గ్రామాలు, ఆవాస ప్రాంతాలు వేల సంఖ్యలో ఉన్నాయి. దేశంలో 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉన్నది. దేశంలో సాగుభూమి విస్తీర్ణం 41 కోట్ల ఎకరాలుగా ఉంది. ప్రతి ఎకరానికి కావలసినంత నీరు అందించినా ఇంకా 30 వేల టీఎంసీల నీరు మిగిలిపోతున్నది. దేశంలో ఇంత జల సంపద ఉన్నా నీటి యుద్ధాలు చెలరేగే పరిస్థితి ఉత్పన్నం కావడానికి కాంగ్రెస్, బీజేపీల అసమర్థ పాలనే కారణం. ఈ రెండు పార్టీలు ఉత్తర, దక్షిణ వివాదాలు, విభేదాలు చోటుచేసుకునే స్థాయికి పరిస్థితిని దిగజార్చాయి. మరోవైపు దాదాపుగా మనతోపాటే అభివృద్ధి ప్రయాణం ప్రారంభించిన చైనా మనం మరో 50 ఏండ్లకు కూడా అందుకోలేనంత స్థాయికి చేరుకున్నది.
‘ఈ దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలి. సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లాలి. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలి. రాష్ర్టాలను కనీసం సంప్రదించకుండానే వాటి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలను కేంద్రం ఏకపక్షంగా తీసుకుని రుద్దడం వల్ల ఆయా రాష్ర్టాల్లో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ర్టాల స్వయం ప్రతిపత్తికి విఘాతం కలుగుతున్నది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి తదితర అంశాల్లో కేంద్రానికి మితిమీరిన అజమాయిషీ ఎందుకుండాలి? అని మనం వేస్తున్న ప్రశ్నల మీదే ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఆయా రాష్ర్టాల భౌగోళిక భిన్నత్వం, సాంస్కృతిక ప్రత్యేకతలు, స్థానిక అవసరాలు, సామాజిక కూర్పు ఆధారంగా రాష్ర్టాలు తీసుకోవాల్సిన నిర్ణయాలను కేంద్రమే తీసుకోవడం వల్ల రాష్ర్టాల నిర్దిష్ట అవసరాలకు, ప్రయోజనాలకు మధ్య పొంతన లేకుండా పోతున్నది. దేశ విశాల ప్రయోజనాల కోసం కాకుండా కేంద్రం తమ చిల్లర మల్లర ప్రయోజనాల కోసం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆయా రాష్ర్టాల అభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారుతున్నాయి. అందుకే ఈ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అనివార్యం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని, దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రతిపాదించారు. టీఆర్ఎస్ను ‘బీఆర్ఎస్’గా మార్చారు.
జాతీయ రాజకీయాల్లోకి రావాలనే కేసీఆర్ ఆలోచన నేటిది కాదు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 మార్చి 3న హైదరాబాద్లోని ప్రగతిభవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో మొదటిసారిగా చెప్పారు. అవసరమైతే తానే ఈ మార్పు కోసం ప్రయత్నిస్తానని, జాతీయ రాజకీయా ల్లో క్రియాశీల పాత్ర పోషిస్తానని ప్రకటించారు. వివిధ రాష్ర్టాల్లో పర్యటించి, దేశవ్యాప్తంగా మద్దతు కూడగడతానని ప్రకటించారు. తదనుగుణంగానే 2022 అక్టోబర్ 5న టీఆర్ఎస్ను ‘బీఆర్ఎస్’గా మార్చి జాతీయ పార్టీని ఏర్పాటు చేశారు. జాతీయ రాజకీయాల్లో పాల్గొనాలనే కేసీఆర్ నిర్ణయాన్ని టీఆర్ఎస్ స్వాగతించింది. దేశ రాజకీయాల్లో మార్పు రావాలని, ఆ మార్పు తెలంగాణ నుంచే మొదలవుతుందని జాతీయ పార్టీ ఏర్పాటు సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు.
‘ప్రజలను గెలిపిస్తం, ప్రగతిని సాధిస్తం. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఇక దేశాన్ని బాగు చేసుకుందాం. గెలవాల్సింది ప్రజలు, రాజకీయ పార్టీలు కాదు. జాతీయ పార్టీ ఏర్పాటుపై ఆషామాషీగా నిర్ణయం తీసుకోలేదు. ఎందరో నాయకులు, అన్ని వర్గాల వారు కలిసి వస్తున్నారు. దళిత, రైతు, గిరిజన ఉద్యమాలే ప్రధాన ఎజెండా. సామాజిక రుగ్మతలపై తీవ్రంగా పోరాడుతాం. ఇదే కారు గుర్తు, ఇదే గులాబీ జెండా ఉంటది. తెలంగాణ కార్యక్షేత్రంగా భారత్ అభివృద్ధి చెందుతుంది’ అని టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ స్పష్టంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చేసిన తీర్మానాన్ని ఢిల్లీలోని ఎన్నికల సంఘానికి పంపించారు. త్వరలోనే బీఆర్ఎస్కు ఎన్నికల సంఘం రాజముద్ర పడే అవకాశం ఉన్నది. కేంద్రంలోని బీజేపీ విద్వేష, విభజన రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీతోనే తెరపడనున్నది.
– తక్కెళ్లపల్లి రవీందర్రావు
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు)