కరీంనగర్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్, (నమస్తే తెలంగాణ) : “తెలంగాణ బాగున్నది. అన్ని రంగాల్లో ఎదిగింది. అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్నది. ఇక్కడ అన్నివర్గాలకు పని దొరుకుతున్నది. పనికి తగ్గ వేతనం అందుతున్నది. అర్హులందరికీ పథకాలు అందుతున్నాయి. పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. ఇది మనమంతా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇదంతా సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమైంది. కేసీఆర్ ప్రధాని అయితే దేశం కూడా రోల్ మోడల్గా మారుతుంది. బీఆర్ఎస్తో అన్ని వర్గాలకూ మేలు జరుగుతుంది.’ అని విభిన్న వర్గాల ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరమని, ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితిని తేవడం సంతోషంగా ఉందన్నారు. దేశానికి మంచి రోజులు రాబోతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిదేండ్లలో తెలంగాణ రోల్ మోడల్గా ఎలా మారిందో.. రేపు అలానే దేశం ఆదర్శంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
విజయబావుటా ఎగురవేస్తరు
కేసీఆర్తోనే దేశంలోని రైతులందరికీ మేలు జరుగుతది. మోదీ సర్కార్ వచ్చినప్పటి నుంచి వరికి మద్దతు ధర పెద్దగా పెంచలేదు. రైతుల బాగు కోసం బీజేపీ చేసిందేమీలేదు. కానీ, సీఎం కేసీఆర్ సార్ రైతులకు అండగా ఉన్నడు. ఆయన దేశ రాజకీయాల్లో విజయబావుటా ఎగురవేస్తరు. రైతుల పాలిట బీజేపీ చూపెడుతున్న ఒంటెత్తు పోకడలకు కేసీఆర్ మాత్రమే సరైన సమాధానం చెప్తరు. దేశాన్ని పాలించే అనుభవం కేసీఆర్కు పుషలంగా ఉన్నది. ఆంధ్రా పాలకుల కుట్రలను తిప్పికొట్టి తెలంగాణను సాధించి చూపిన మాదిరిగానే గుజరాతీల పెత్తనం అడ్డుకొని దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేయగల సత్తా ఆయనకున్నది. దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయ రంగాన్ని ముంచిన బీజేపీపై కేసీఆర్ విజయం సాధిస్తరు. వ్యవసాయరంగాన్ని గాడిలో పెడతరు.
– గూడూరి జనార్దన్రెడ్డి, రైతు, ఇప్పల్నర్సింగాపూర్ (హుజూరాబాద్)
కేసీఆర్తోనే పేదల బతుకులకు భరోసా
తెలంగాణ సాధించుకున్నంక ముఖ్య మంత్రి కేసీఆర్ పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నడు. ఇన్ని సంక్షేమ పథకాలు మేం ఎప్పుడూ చూడలేదు. తెలంగాణ నుంచి దేశానికి ఒక నాయకుడిగా మన సార్ వెళ్తున్నడంటే మాకెంతో సంతోషంగా ఉంది. మహారాష్ట్ర, బీహార్, చత్తీస్ఘడ్ వంటి రాష్ర్టాల్లో మాలాంటి కార్మికుల పరిస్థితి ఆధ్వాన్నంగా ఉంది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా పేరు మార్చిన సీఎం కేసీఆర్, దేశ రాజకీయాల్లో నాయకత్వం వహిస్తే అన్ని రాష్ర్టాల్లోని సబ్బండ వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతయ్. దేశంలోని రైతులంతా సుఖసంతోషాలతో జీవిస్తరు. దేశం అన్నపూర్ణగా ఖ్యాతి గడుస్తది. – మూల శ్రీనివాస్రెడ్డి, పంపుసెట్ల మెకానిక్, సిరిసిల్ల(రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ)
దేశానికి కేసీఆర్ నాయకత్వం కావాలి
టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు సిరిసిల్లలో నేతకార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా ఉండేవి. ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో రోజుకో కార్మికుడు ఉరితాడుకు వేలాడేది. నేతకార్మికులతో స్వయంగా చర్చలు జరిపి సమస్యలు విన్న తొలి ముఖ్యమంత్రి కేసీఆరే ఒక్కరే. ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను బతుకమ్మ చీరల తయారీ, ప్రభుత్వ వస్ర్తాల తయారీ ఆర్డర్లు ఇచ్చి ఆదుకున్న మహానేత సీఎం కేసీఆర్. మా ఎమ్మెల్యే కేటీఆర్ సార్. ఒకప్పుడు చేసేందుకు పనిలేక పస్తులున్న రోజులు ఉన్నయ్. పండుగ వస్తే చేతిల పైసలు లేక బిక్కు బిక్కుమంటూ ఏడుస్తూ గడిపేది. ఈ ఆర్డర్లు వచ్చినంక మా జీవితాలు పూర్తిగా మారినయ్. నెలకు రూ.15నుంచి రూ.20వేలు సంపాదిస్తూ పిల్లా పాపల్తో సంతోషంగా గడుపుతున్నం. కేసీఆర్ లాంటి ప్రజల కోసం పనిచేసే నాయకత్వం దేశానికి ఎంతైనా అవసరం.
– మచ్చ ఎల్లప్ప, విద్యానగర్ (సిరిసిల్లటౌన్)
అన్ని వర్గాలకు న్యాయం
తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మహిళా సంఘాలు బలోపేతమయ్యాయి. పావలా వడ్డీ రుణాలు ఇచ్చి ఆర్థికంగా ఎదిగేలా చేశారు. వ్యవసాయం విస్తరించింది. అన్ని రంగాల్లోని కార్మికులకు చేతి నిండా పని దొరికింది. కూలీ రేట్లు గిట్టుబాటు అవుతున్నాయి. కేసీఆర్ ప్రధాని అయితే దేశమంతా మిషన్ భగీరథ నీరందించగలుగుతారు. దళిత బంధు, రైతుబంధు వంటి పథకాల ద్వారా చాలా మంది జీవితాలు బాగుపడుతున్నాయి. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశమంతా అమలు కావాలంటే బీఆర్ఎస్ కూడా అన్ని రాష్ర్టాల్లో పటిష్టం కావాలి. అందుకు ప్రజల మద్దతు కేసీఆర్కు లభిస్తుంది.
– ఎలుక కిరణ్కుమార్, ప్లంబర్ కార్మికుడు, సిరిసిల్ల (రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ)
దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తరు
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడాన్ని అన్ని వర్గాల వారు సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే, దేశ స్థాయిలో వివిధ రాష్ర్టాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కడి ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు దేశంలో జాతీయస్థాయిలో రెండు పార్టీల హవానే కొనసాగింది. ప్రజల ఆశీస్సులతో భవిష్యత్తులో దేశంలో కేసీఆర్ ప్రధాన పాత్ర పోషిస్తరు.
– రావుల రమేశ్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు
(తిమ్మాపూర్రూరల్)
మానవత్వాన్ని గెలుపించేదే బీఆర్ఎస్
దేశంలోని సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం అవతరించిన బీఆర్ఎస్ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. రైతులు, మధ్య తరగతి ప్రజల బతుకులతో చెలగాటమాడుతూ సంపన్న వర్గాల కొమ్ము కాస్తూ దేశాన్ని దోచేస్తున్న బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా పేరు మార్చారు. దేశంలోని రైతులను రాజులను చేయాలన్నా.. సబ్బండ వర్గాల అభివృద్ధి జరుగలన్నా అది కేసీఆర్తోనే సాధ్యం. నల్ల చట్టాలతో రైతులకు, గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యవసరాల ధరలను పెంచి సామాన్యులకు మోదీ ప్రభుత్వం శాపంగా మారింది. దాని నుంచి దేశాన్ని కాపాడడం కేసీఆర్కే సాధ్యం. ఆయన పోరాటంతో సాధించిన తెలంగాణ రాష్ట్రం, సుపరిపాలనతో సాధించిన ప్రగతిని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు గమనిస్తున్నారు. అందుకే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ను స్వాగతిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక పార్టీలన్నీ బీఆర్ఎస్ ప్రభంజనంలో కొట్టుకుపోవడం ఖాయం.
-కొలిపాక సమ్మయ్య, ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు, కరీంనగర్ (హుజూరాబాద్టౌన్)
అభివృద్ధి అంటే కేసీఆరే
ప్రాంతీయ పార్టీలను ఐక్యం చేసి సత్తా చాటగలిగే సమర్థుడు సీఎం కేసీఆర్. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత అభివృద్ధిలో తెలంగాణను దేశానికి రోల్మోడల్గా నిలిపారు. అభివృద్ధి అంటే ఆయనే అనేస్థాయిలో రుజువు చేశారు. ఇంతటి అభివృద్ధి కండ్లముందు కనిపిస్తున్నా చూసీ చూడనట్లు, నిజాన్ని దాచినట్లు మాట్లాడే నాయకులకు నిజంగానే మూగ, చెవిటి అని చెప్పొచ్చు. అలాంటి వారి నుండి దేశాన్ని రక్షించాలన్నా.. వారికి సరైన సమాధానం చెప్పాలన్నా కేసీఆర్తోనే సాధ్యం. గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టి రైతులందరినీ జాతీయంగా ఐక్యం చేస్తే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మిన ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లోకి వెళ్లడం శుభసూచకం.
–జోగినిపెల్లి మోహన్రావు, విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి, సిరిసిల్ల
సార్ సేవలు దేశానికి అవసరం
తెలంగాణ వాళ్లకు పాలన రాదు అన్నవాళ్ల నోటనే సూపర్ అనిపించుకున్న నేత సీఎం కేసీఆర్ సార్. ఇలాంటి అభివృద్ధి, పరిపాలనా దక్షత దేశవ్యాప్తంగా అవసరం ఉన్నది. ఎనిమిదేండ్లలోనే దేశంలోనే రాష్ర్టాన్ని నంబర్ వన్గా ఉంచారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమం గురించి అలోచించారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు సార్ ప్రవేశపెట్టిన పథకాలను కాపీ కొట్టిన చరిత్ర ఉన్నదంటే.. సార్ ఛరిష్మా దేశానికి అవసరం అని తేలిపోయింది. దేశాన్ని అద్భుతంగా తయారు చేస్తారు.
-పారునంది జలపతి, మన్నెంపల్లి (తిమ్మాపూర్రూరల్)
మా బతుకులు మారుతయ్
కేసీఆర్ సార్ తెచ్చిన దేశ రాజకీయాల్లో వచ్చి అధికారంలోకి వస్తే మా బతుకులు మారుతయ్. ఇక్కడ ఎట్లయితే అన్ని సదుపాయాలు ఉన్నయో మా రాష్ట్రంల కూడా సదుపాయాలు పెరుగుతయ్ అనుకుంటున్న. మాది మధ్యప్రదేశ్లోని బయ్యార్ జిల్లా లఫరా గ్రామం. మాకు ఎలాంటి భూమి లేదు. నేను నా భర్త చిన్న పిల్లలు కలసి ఇక్కడికి వచ్చి బంగ్ల పని చేసుకుంటున్నం. మా దగ్గర ఇంత పని ఉండదు. మళ్లీ కూలీ తక్కువ. తెలంగాణల అయితే బాగా పైసలు ఉన్నయ్. అందరూ బంగ్లలు కడుతున్నరు. ఇదంతా కేసీఆర్ సార్తోనే జరుగుతున్నదని ఇక్కడోళ్లు చెప్తుంటరు. సార్ ఢిల్లీల ఉంటే మా బతుకులు సుతం ఇట్లనే మారుతయని అనుకుంటున్నం. అక్కన్నే పని దొరికితే ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు కదా.
– కమ్లేసోరి బాహీ, మధ్యప్రదేశ్ కూలీ
దేశంలో మరో సంచలనం
విజయ దశమి రోజు సీఎం కేసీఆర్ చారిత్రత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీనీ జాతీయ పార్టీగా పేరు మార్చడం మంచి విషయం. ఆయన దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తారు. దేశంలో సంచలనంగా మారి, దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావడం ఖాయం.
– చిక్కాల రామారావు, సెస్ మాజీ చైర్మన్ (సిరిసిల్లరూరల్)
తెలంగాణల పథకాలు బాగున్నయ్..
మాది ఒడిశా. ఓదెల మండల కొలనూర్కు రెండేళ్ల కింద వచ్చిన. మాకాడ కూలీ పనులు సరిగ్గా దొరకవు. దొరికినా రోజుకు రూ.300 దాకా ఇత్తరు. తెలంగాణల మంచిగ పనులు దొరుకుతున్నయని తెలిస్తే వచ్చిన. రోజుకు రూ.600 దాకా దొరుకుతున్నయ్. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్న ఈ రాష్ట్రంల పేదల కోసం మంచి, మంచి కార్యక్రమాలు ఉన్నయ్. పథకాలు చూస్తే మంచిగ అనిపిస్తుంది. కేసీఆర్ సీఎం పేదలకు మంచిగ జేత్తుండు. ఇప్పుడు దేశ రాజకీయాలకు వస్తే మాలాంటి పేదలకు మంచి పథకాలు వచ్చి మా రాష్ట్రంలోనే పిల్లాపాపలతో బతుకవచ్చని అనిపిస్తుంది. కేసీఆర్ వస్తే దేశమంతా మంచిగ ఉంటుంది. కేసీఆర్ ప్రధానమంత్రి కావాలె.
– జైరాం, ఒడిశా కార్మికుడు (కొలనూర్, ఓదెల)
పేదల సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం
పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. విజయదశమి రోజు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా పేరు మార్చడం హర్షనీయం. బడుగు, బలహీన వర్గాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుతున్న ఆయన, బీఆర్ఎస్తో దేశంలోని అన్ని వర్గాల్లోని పేదల ప్రయోజనాల కోసం పని చేస్తారనడంలో సందేహం లేదు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది. దేశానికి దిక్సూచిగా ఉంటూ సమూల మార్పులు తీసుకువచ్చే సత్తా కేసీఆర్లోనే ఉంది. ఆయన వెంటే దేశ ప్రజలు ఉంటారు.
– కొత్త శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు(చిగురుమామిడి)
దేశ భావి ప్రధాని కేసీఆర్
తెలంగాణ పథకాలే దేశానికి దిక్సూచి. దేశ రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా పేరు మార్చారు. కాంగ్రెస్, బీజేపీలు దేశంలో విఫలమయ్యాయి. దేశ ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. దేశ రాజకీయాల్లో నవశకానికి కేసీఆర్ నాంది పలికారు. భావి ప్రధాని కేసీఆరే.
– గజభీంకార్ రాజన్న, మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, తంగళ్లపల్లి (సిరిసిల్ల రూరల్)
మా రాష్ట్రం బాగుపడుతది..
మాది మధ్యప్రదేశ్ రాష్ట్రం. అక్కడ తెలంగాణ లెక్క పనులు దొరుకయ్. దొరికినా కైకిలి చాలా తక్కువ. అట్లయితే ఎట్ల బతుకుతం. తెలంగాణల పనులు మస్తు దొరుకుతున్నయని తెలిసి మూడేళ్ల కింద మా రాష్ట్రం నుంచి నలుగురం ఓదెల మండలం కొలనూర్కు వచ్చినం. ఇక్కడ సిమెంట్ ఇటుకలు తయారు చేసే పనిలో చేరినం. ఇక్కడ ఉపాధికి ఢోకా లేదు. మా రాష్ట్రంల ఏ పని చేసినా రోజుకు రూ.200 కంటే ఎక్కువ ఇచ్చేటోళ్లు కాదు. కానీ ఇక్కడ రోజుకు రూ.700 నుంచి 800 దొరుకుతున్నై. చానా సంతోషగా ఉంది. ఇక్కడోళ్లు చానా మంచోళ్లు. మాకు ఇక్కడ ఉండడానికి ఓనర్ ఇల్లు ఇచ్చిండు. ఇంకా వంట కోసం గ్యాస్, బియ్యం కూడా ఇస్తుండు. మాకు తెలుగు భాష రాకున్నా ఇక్కడోళ్లు మంచిగ చూసుకుంటున్నరు. మాకు ఇక్కడ ఉండడానికి ఓనర్ ఇల్లు, గ్యాస్, బియ్యం ఇత్తుండు. చానా సంతోషంగ ఉంది. ఆరు నెలలకు ఒకసారి ఇంటికి పోయి వస్తం. కేసీఆర్ సార్ మాకాడికి కూడా వస్తున్నడంటే సంతోషమైతంది. మా రాష్ట్రం కూడా బాగుపడుతది. మేం ఇలా వేరే ప్రాంతానికి వచ్చి పని చేయాల్సిన బాధ లేకుండా పని చూపిస్తడనే నమ్మకం ఉంది.
– అర్జున్, మధ్యప్రదేశ్ కూలీ (ఓదెల)
మాకూ ఉచిత కరెంట్ వస్తది
మాది మహారాష్ట్రలోని గొందియా జిల్లా, గిరోలె గ్రామం. చాలా వెనుకబడిన ప్రాంతం. మా ఇంటికాడ ఎకరం భూమి ఉంది. కానీ, ఏం లాభం కరెంట్ ఉండదు. నీళ్లుండయి. పది పదిహేను రోజులు కష్టపడి ఏదో పంట వేసుకుంటం. మళ్లీ ఏదో ఒక పని చేసుకోవాల్సిందే. ఆ పని కూడా అక్కడ దొరకదు. నాలుగైదు రోజులకోసారి ఏదో ఒక పని దొరుకుతది. ఏం లాభం. తెలంగాణల ఒక్క ఎకరం భూమి ఉన్న రైతులు కూడా కుటుంబాన్ని గడుపుతున్నరు. ఇక్కడి సీఎం కేసీఆర్ అన్ని సదుపాయాలు చేస్తున్నరు. మాకు ఇసోంటి నాయకుడు ఉంటే మా బతుకులు ఎప్పుడో మారిపోయేవి. రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నరు. మా దగ్గర కరెంట్ కనెక్షన్ కావాలంటే శానా కష్టం. ఇక్కడ రైతులు ఇట్ల అడుగుతరో లేదో అట్ల ఇస్తరట. కేసీఆర్ సార్ ఢిల్లీల కూసుంటే దేశం మొత్తం ఫ్రీ కరెంట్ వస్తది. అందులో మాకు కూడా వస్తది. ఉన్నదాంట్లో వ్యవసాయం చేసుకుని ఇంటికాడనే బతికేయవచ్చు. కేసీఆర్ గురించి ఇక్కడి వాళ్లు శానా గొప్పగ చెబుతరు. ఆయన మాకు కూడా అవసరమే.
– పురుషోత్తం రాంజీ దేశ్ముఖ్, మహారాష్ట్ర కూలీ
అన్ని వర్గాలు కేసీఆర్నే కోరుతున్నాయి..
రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల దోపిడీ పాలనకు చరమగీతం పాడి ప్రజలకు సుభిక్షమైన పాలన అందించేందుకే కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా పేరు మార్చారు. కేసీఆర్ నాయకత్వం వహిస్తే దేశానికి మోదీ పాలన నుంచి విముక్తి కలుగుతుంది. ప్రజలకు త్వరలో మంచి రోజులు వస్తాయి.
– సత్తార్, మసీదు కమిటీ మాజీ అధ్యక్షుడు (సిరిసిల్లటౌన్)
అన్ని రాష్ర్టాల పరిస్థితులు మారుతయ్
మాది బీహార్ రాష్ట్రంలోని సిపోల్ జిల్లా. మా రాష్ట్రంల ఎంత పెద్ద చదువు చదివినా జాబ్స్ ఉండయ్. తెలంగాణల కనీసం చదువు తగ్గ పనులన్నా దొరుకుతయ్. మా దగ్గర అది కూడా లేదు. పెద్ద చదువులు చదివి ఎందరో నిరుద్యోగులు పొట్ట చేతపట్టుకుని తెలంగాణకు వలస వస్తున్నరు. కూలీ పని చేసుకుని పైసలు సంపాదించి ఇంటికి పోతున్నరు. తెలంగాణల దొరకని పని ఉండదు. మేం కూడా చదువుకుని ఉద్యోగాలు లేక ఇక్కడికి కూలీ పనికి వచ్చినం. మాకు ఇక్కడ రోజూ పని దొరుకుతంది. ఎంత ఏజ్ వచ్చినా పెండ్లి చేసుకోవాలనే ఆలోచన బీహారీలకు రాదు. ఎందుకంటే ఎట్ల బతుకుడని చాలా మంది భయపడుతరు. కేసీఆర్ లాంటి లీడర్ పీఎం అయితే అన్ని రాష్ర్టాల పరిస్థితులు మారుతయ్. ముఖ్యంగా యువకులు, రైతుల బతుకులు తప్పక మారుతయనే నమ్మకం నాకున్నది.
– రంజిత్, బీహార్ కూలీ