బీఆర్ఎస్ | ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా మార్పు చేస్తూ చేసిన తీర్మానం సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రధాన చౌరస్తాలల్లో పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంచిపెట్టారు. కొన్ని జిల్లాల్లో కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఆదిలాబాద్ లో..
భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు.
పెద్దపల్లిలో..
టీఆర్ఎస్ పార్టీ ని జాతీయ పార్టీగా ప్రకటించడం పట్ల పెద్దపల్లి జిల్లాకేంద్రంలో టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు. ‘దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
నల్గొండలో ప్రత్యేక పూజలు
భారత్ రాష్ట్ర సమితిని స్వాగతిస్తూ నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణలు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని వీటీకాలనీలో ఉన్న శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించినందున తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లుగానే భారతదేశం యొక్క స్థితిగతులు కేసీఆర్ నాయకత్వంలో మారాలని ఆంజనేయస్వామిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు రావుల శ్రీనివాస రెడ్డి, తదితరులు పాల్గొన్నారు నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు నార్కట్పల్లిలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి పెట్టారు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదీరెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు ఇందులో పాల్గొన్నారు. చండూరులో టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ..
జిల్లాలోని యాదగిరిగుట్టలో టీఆర్ఎస్ శ్రేణులు టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు.
సూర్యపేటలో..
బీఆర్ఎస్ ప్రకటన వెలువడిన వెంటనే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బాణాసంచాలను పెద్ద ఎత్తున కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ‘దేశ్ కీ నేత కేసీఆర్..జై కేసీఆర్ ’ అంటూ నినాదాలు చేశారు.