అమరావతి : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం పాలకోసం వెళ్లి విద్యుదాఘాతానికి గురై ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. పొలం వద్ద ఉన్న గేదేల నుంచి పాలు తీసుకొచ్చేందుకు వెళ్లిన అన్నదమ్ములు నాగేంద్ర(19), ఫణీంద్ర(17) దారిలో తెగిపడిన విద్యుత్ తీగలు గమనించలేదు.
దీంతో వారికి వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి వచ్చి ఇద్దరు కుమారుల మృతదేహాలను చూసి బోరున విలపించడంతో స్థానికులు కంటనీరు పెట్టుకున్నారు.
పోలీసులు గ్రామానికి చేరుకుని శవ పంచనామ జరిపారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.