న్యూఢిల్లీ: టర్కీ వేదికగా జరుగుతున్న బోస్పోరస్ బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పోరాటం ముగిసింది. గత రెండు బౌట్లలో ప్రపంచ చాంపియన్లను మట్టికరిపించిన నిఖత్కు సెమీస్లో చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన మహిళల 51కిలోల సెమీస్లో నిఖత్ 0-5 తేడాతో టర్కీ ఫేవరెట్ బుసెనాజ్ చేతిలో ఓటమిపాలై కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. 2019 ప్రపంచ చాంపియన్ అయిన బుసెనాజ్.. నిఖత్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కరోనా వైరస్ విజృంభణ తర్వాత తొలిసారి బాక్సింగ్ టోర్నీ బరిలోకి దిగిన జరీన్.. తొలుత అద్భుత విజయాలతో ఆకట్టుకుంది. గత జనవరి నుంచి ఢిల్లీలో శిక్షణ తీసుకున్న ఈ ఇందూరు బాక్సర్ అంచనాలకు అనుగుణంగా రాణించింది. మరోవైపు సోనియా లాథర్ (57కి), పర్వీన్ (60కి), జ్యోతి (69కి), శివథాపా (63కి) ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించారు.