Rishi Sunak | దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ స్పష్టం చేశారు. రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అంతటా ప్రొఫెషనలిజంతో కూడిన అకౌంటబిలిటీ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ సంస్థల్లో ఆర్థిక సుస్థిరత తీసుకొస్తానని పేర్కొన్నారు.
మంగళవారం బ్రిటన్ ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత అధికార నివాసరం డౌనింగ్ స్ట్రీట్-10 నుంచి రిషి సునాక్ మాట్లాడారు. ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్తిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మాజీ ప్రధాని లిజ్ ట్రస్ హయాంలో జరిగిన పొరపాట్లను చక్కదిద్దుతానని రిషి సునాక్ స్పష్టం చేశారు. ఆర్థిక సుస్థిరత, విశ్వాసం కల్పించడమే తమ ప్రభుత్వ ఏజెండా అని అన్నారు. తక్షణం తమ ప్రభుత్వ పనితీరు మొదలవుతుందని వెల్లడించారు.
ఇంతకుముందు బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ప్రజలను, వ్యాపారాలను కాపాడేందుకు చర్యలు తీసుకున్నానని, ఇప్పుడు దేశాన్ని ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడవేసేందుకు అవే చర్యలు తీసుకుంటామన్నారు. భావి తరాలను అప్పుల ఊబిలో దించలేనని స్పష్టం చేశారు. కబుర్లతో కాలక్షేపం చేయకుండా దేశ ఐక్యత కోసం కృషి చేస్తానని రిషి సునాక్ హామీ ఇచ్చారు. మనమంతా కలిసి పని చేస్తే నమ్మశక్యం గానీ విజయాలను సాధించగలమని చెప్పారు.
రాజకీయ నాయకుడిగా మారిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ రిషి సునాక్ (42).. బ్రిటన్ ప్రధానిగా అతి పిన్న వయస్కుడు. గత 210 ఏండ్లలో అత్యంత చిన్న వయస్సులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేతగా రిషి సునాక్ నిలిచారు.
లక్షల మంది బ్రిటన్ వాసులు ఆహార, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యావత్ దేశం నిధుల లేమిని ఎదుర్కొంటున్నదని, తాను తప్పనిసరిగా ఆర్థిక సంక్షోభానికి పరిష్కార మార్గాలు వెతకడంపైనే దృష్టి సారిస్తానని చెప్పారు.