హైదరాబాద్, డిసెంబర్ 7: అడ్వర్టైజ్మెంట్ టెక్నాలజీ పరిశ్రమలో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండు కంపెనీల మధ్య రూ. 566 కోట్ల విలువైన టేకోవర్ లావాదేవీ జరిగింది. బ్రైట్కామ్ గ్రూప్ (గతంలో వైబ్రెంట్ డిజిటల్)…మీడియామింట్లో నూరు శాతం వాటాను కొనుగోలుచేసింది. ఈ మేరకు బ్రైట్కామ్ మంగళవారం స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఇరు కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం రూ.566 కోట్ల లావాదేవీ ముగిసే సమయంలో రూ. 360 కోట్ల నగదును మీడియామింట్ బ్రాండ్పేరుతో వ్యాపారం చేస్తున్న ఉచి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వాటాదారులకు బ్రైట్కామ్ గ్రూప్ (బీసీజీ) చెల్లిస్తుంది. రూ.170 కోట్లను బీసీజీ షేర్ల రూపంలో ఇస్తారు. లావాదేవీ ముగిసిన తర్వాత ఆరునెలల్లో మిగిలిన రూ.36 కోట్ల నగదును చెల్లిస్తారు.
1,300 మంది సిబ్బంది… 187 కోట్ల ఆదాయం
మీడియామింట్…అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, పబ్లిషర్లు, డిజిటల్ ప్లాట్ఫామ్స్కు డిస్ప్లే, వీడియో, మొబైల్ అడ్వర్టైజింగ్ సర్వీసుల్ని అందిస్తుంది. ఈ సంస్థకు హైదరాబాద్తో పాటు అమెరికా, పోలెండ్ల్లో కార్యాలయాలున్నాయి. 1,300 మంది సిబ్బందిని కలిగిన మీడియామింట్ 2022 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో రూ. 187 కోట్ల ఆదాయం ఆర్జిస్తుందని అంచనా. మీడియామింట్ టేకోవర్తో తమ కస్టమర్లకు సొల్యూషన్లను వేగంగా అందించగలుగుతామని, అలాగే మీడియామింట్ బ్యాక్ఎండ్ బిజినెస్లో పటిష్టమైన వృద్ధిని అంచనావేస్తున్నట్లు బ్రైట్కామ్ గ్రూప్ చైర్మన్ సురేష్ రెడ్డి చెప్పారు. మీడియామింట్ లీడర్షిప్ టీమ్ నీలిమా మరుపూరు, అనూశ్ కుమార్, జాసన్ రిబాక్, ఆశే పరాద్కర్లు ఇకమీదట కూడా వ్యాపార వృద్ధికి మార్గనిర్దేశం వహిస్తారు. ఈ టేకోవర్ వార్త నేపథ్యంలో బ్రైట్కామ్ గ్రూప్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పెరిగి రూ.139 వద్దకు చేరింది.