బెంగళూరు: కర్ణాటకలో ఒక విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. పెండ్లి సందడితో కళకళలాడిన ఓ ఇంట్లో కొన్ని గంటల్లోనే రోదనలు మిన్నంటాయి. అప్పటిదాకా కేరింతలతో అలరారిన ఆ ఇల్లు కాసేపటికే ఏడుపులు, పెడబొబ్బలతో మారుమోగింది. బంధుమిత్రుల మధ్య వరుడితో ఆనందంగా తాళి కట్టించుకున్న వధువు పెండ్లి బట్టల్లోనే కుప్పకూలి కన్నుమూసింది. కర్ణాటకలోని అడ్యార్ పట్టణలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం (ఫిబ్రవరి 28) మధ్యాహ్నం తర్వాత అడ్యార్ మసీదులో లైలా అఫియా అనే 23 ఏండ్ల యువతికి, ముబారక్ అనే యువకుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. లైలాతోపాటు ఆమె సోదరుడి వివాహం కూడా అదే వేదికపై, అదే సమయంలో వివాహం చేసుకున్నాడు. లైలా తండ్రి అబ్దుల్ కరీం బీరప్పగద్దె జమాత్ అధ్యక్షుడు కావడమేక, ఆయన పిల్లలిద్దరి పెండ్లిళ్లు ఒకే మంటపంలో జరుగుతుండటంతో బంధుమిత్రులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
దాంతో వివాహం ఘనంగా జరిగింది. అతిథులందరూ వధూవరులను ఆశీర్వదించి వెళ్లారు. అదేరోజు సాయంత్రం వధూవరులు, వారి కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు వధువు లైలా ఇంటికి వెళ్లారు. రాత్రంతా వధూవరులతో కలిసి ఇరుకుటుంబాల వాళ్లు సందడి చేశారు. ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేశారు. అయితే అందరితో కలిసి సందడి చేస్తూ అర్ధరాత్రి తర్వాత పెండ్లి కుమార్తె లైలా ఛాతిలో నొప్పిగా ఉందంటూ ఒక్కసారిగా కుప్పకూలింది.
దాంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బీరప్పగద్దె మసీదు సమీపంలో ఆమెను ఖననం చేశారు. లైలా మృతికి గుండెపోటే కారణమని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కాగా, పెండ్లి జరిగిన కొన్ని గంటల్లోనే వధువు మరణించడంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.