Maruti Suzuki | మారుతి సుజుకి ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన న్యూ జనరేషన్ ఎస్యూవీ వేరియంట్ కార్లు బ్రెజా, గ్రాండ్ విటారాకు వినియోగదారుల నుంచి ఫుల్ గిరాకీ వస్తోంది. ఇప్పటికే ఈ రెండు కార్ల కోసం 1.40 లక్షల బుకింగ్స్ నమోదయ్యాయి. దేశీయ కార్ల మార్కెట్లో తిరిగి 50 శాతం వాటాను వడిసి పట్టే లక్ష్యంతో ముందుకు సాగుతోంది మారుతి సుజుకి. ఈ రెండు కార్ల బుకింగ్స్ తోనే మారుతి సుజుకికి రూ.25 వేల కోట్ల ఆదాయం లభిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఇదిలా ఉంటే, ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా స్విఫ్ట్, బాలెనో వంటి హ్యాచ్ బ్యాక్ కార్లను స్పేషియస్గా, ఫ్యాషనబుల్గా, సేఫ్టీ కార్లుగా తీర్చి దిద్దడానికి సన్నాహాలు చేస్తున్నది.
ఇప్పటికే మారుతి సుజుకి తన బ్రెజా కార్ల బుకింగ్స్లో 45 వేల కార్లు డెలివరీ చేసింది. ఇక గ్రాండ్ విటారా డెలివరీ ప్రారంభించాల్సి ఉంది. న్యూ బ్రెజా, మిడ్ సైజ్ విటారా మోడల్ కార్లలో ఏదైనా రూ.15 లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేయాల్సిందే. ఈ రెండు వేరియంట్ల ఈ-ఆర్డర్ బుకింగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు వేరియంట్ల బుకింగ్స్ తోనే రూ.25 వేల కోట్ల ఆదాయం వస్తుందని సంస్థ యాజమాన్యం అంచనా వేసింది.
గ్రాండ్ విటారా, బ్రెజాలతోపాటు ఎక్స్ఎల్6, న్యూ ఎర్టిగా వంటి కొత్త కార్లు ఆవిష్కరించింది మారుతి సుజుకి. దీంతో యుటిలిటీ వెహికల్స్ బుకింగ్స్ 2.40 లక్షల యూనిట్లు ఉంటాయని చెబుతున్నది. వీటి విలువ రూ.35 వేల కోట్లు ఉంటుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. సమీప భవిష్యత్లో మరికొన్ని కొత్త మోడల్ కార్లు ఆవిష్కరిస్తామంటున్నారు.
బ్రెజా, గ్రాండ్ విటారా బుకింగ్స్ నిజంగా ప్రోత్సాహకరంగా ఉన్నాయని శశాంక్ శ్రీవాత్సవ అన్నారు. ఈ రెండు కార్లకు ఉన్న డిమాండ్తో వార్షిక ఎస్యూవీ కార్ల సేల్స్ మూడు లక్షల యూనిట్లకు చేరుతాయని మారుతి అంచనా వేసింది. ఈ ఏడాది ముగిసే నాటికి వార్షిక ఎస్యూవీ కార్ల సేల్స్ రిట్టింపు అవుతాయని భావిస్తున్నది.