హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న వారు తీయటి శీతలపానీయాలు ఎక్కువగా తాగడం వల్ల త్వరగా మరణించే ముప్పు పొంచి ఉన్నదని తాజా అధ్యయనం వెల్లడించింది. సోడా లేదా తీయటి కూల్డ్రింక్స్ ఎన్నడూ తాగని లేదా అత్యంత అరుదుగా తాగే మహిళలతో పోలిస్తే వారానికి కనీసం ఐదుసార్లు తాగే మహిళల్లో మరణం ముప్పు 62శాతం ఎక్కువగా ఉంటుందని ఆ అధ్యయనం తెలిపింది. ఇక రొమ్ము క్యాన్సర్తో బాధపడే మహిళలు కూల్డ్రింక్స్ తాగితే వారి ప్రాణాలకు ముప్పు 85శాతం అధికమని పేర్కొన్నది. ఈ అధ్యయన నివేదిక ‘క్యాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్’ జర్నల్లో ఇటీవల ప్రచురితమైంది. సోడా లేదా తీయటి పానీయాలు, రొమ్ము క్యాన్సర్పై పరిశోధన వినూత్నమైనదని అమెరికాలోని బఫెలో స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు చెందిన పీహెచ్డీ విద్యార్థి నాడియా కోయరాట్టి పేర్కొన్నారు. సోడా తాగడం వల్ల బరువు పెరగడం, టైప్-2 మధుమేహం వ్యాధికి గురి కావడం, గుండె సంబంధిత జబ్బులు రావడం వంటి ముప్పు పొంచి ఉన్నప్పటికీ చాలామంది తీయటి సోడాను తాగడం కొనసాగిస్తున్నారని చెప్పారు. తాము రొమ్ము క్యాన్సర్కు గురైన 35 నుంచి 79 ఏండ్ల మధ్య మహిళలపై 19 ఏండ్లపాటు అధ్యయనం చేశామని, వీరిలో 927 మంది కేవలం తీయటి శీతల పానీయాలు తాగడం వల్ల మృత్యువాత పడ్డారని వెల్లడించారు. రొమ్ము క్యాన్సర్ను నిర్ధారించడానికి 12 నుంచి 24 నెలల ముందు వారు ఏమి తిన్నారు, ఏమి తాగారన్నదానిపై వారిని ప్రశ్నించామని తెలిపారు. వారిలో 900 మంది మహిళలు శీతల పానీయాలు తాగడం వల్లనే రొమ్ము క్యాన్సర్కు గురైనట్టు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. వీరిలో 41 శాతం మంది అతి త్వరగా మరణించారని తెలిపారు.
సోడాలో చక్కెర స్థాయి అధికంగా ఉంటుందని, పోషక విలువలు ఏమాత్రం ఉండవని, ఫలితంగా రొమ్ము క్యాన్సర్కు అది దారి తీస్తుందని కోయరాట్టి వివరించారు. చక్కెరలేని టీ, కాఫీలు, పండ్ల రసాలతో కూడిన శీతలపానీయాలలో పోషక విలువలు, విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయని తెలిపారు. చక్కెరతో కూడిన సోడాలో సుక్రోస్, ఫ్రక్టోస్ అధిక స్థాయిలోఉంటాయని, వీటిలోని గ్లూకోజ్, ఇన్సులిన్ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. అమెరకాలో ప్రస్తుతం 35 లక్షల మంది రొమ్ముక్యాన్సర్ బాధితులు ఉన్నారని తెలిపారు.