-ఆ వేదికలను నియంత్రించాల్సిందే
-కేంద్రం మార్గదర్శకాలు సబబే
-‘తాండవ్’ కేసులో సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మార్చి 4: దేశంలో ఓవర్ ది టాప్ (ఓటీటీ) వేదికల్లో ప్రసారమయ్యే వీడియోలపై నియంత్రణ అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కొన్ని ఓటీటీ సంస్థలు ప్రసారం చేసే వీడియోల్లో అశ్లీలం (పోర్నోగ్రఫీ) ఉంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కార్యక్రమాల ప్రసారాన్ని నియంత్రించడానికి ఏదైనా వ్యవస్థ ఉండాలని సూచించింది. సోషల్, డిజిటల్ మీడియా నియంత్రణకు ఇటీవల తెచ్చిన మార్గదర్శకాలను శుక్రవారం కోర్టుకు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇటీవల ప్రసారమైన ‘తాండవ్’ వెబ్సిరీస్ వివాదాస్పదం కావడం తెలిసిందే. సిరీస్లోని కొన్ని ఎపిసోడ్లలో హిందూ దేవతలను అభ్యంతరకరంగా చూపించారని ఆరోపిస్తూ అమెజాన్ భారత విభాగ డైరెక్టర్ అపర్ణ పురోహిత్పై పలువురు కేసులు పెట్టారు. దీంతో ఆమెపై పలు పోలీస్స్టేషన్లలో
ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దీంతో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్కు అనుమతినివ్వాలని కోరుతూ ఆమె అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్ను జస్టిస్ అశోక్భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘కొన్ని ఓటీటీలు అశ్లీల వీడియోలను ప్రసారం చేస్తున్నాయి. వాటిపై నియంత్రణ ఉండాల్సిందే. సెన్సార్ బోర్డు అనుమతించిన సినిమాలను థియేటర్లలో వీక్షించడం ఇప్పుడు తక్కువ అయిపోయింది. ఓటీటీల ద్వారా అన్నింటినీ (వెబ్ సిరీస్లు, సినిమాలు) ఇండ్లల్లోనే కూర్చొని చూస్తున్నారు. అలాంటప్పుడు ఆ ప్రసారాలపై నియంత్రణ ఉండాలి’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. అభ్యంతరకరమైన ప్రసారాలను నియంత్రించటం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మార్గదర్శకాలు సబబేనని పేర్కొంది. ఆ మార్గదర్శకాలను శుక్రవారం సమర్పించాలని, తాము పరిశీలిస్తామని తెలిపింది.