న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ దిగుమతికి బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ అనుమతి నిరాకరించింది. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) అవసరాలను తీర్చడం లేదని పేర్కొంది. బ్రెజిల్ ప్రభుత్వం 20 మిలియన్ డోసులను కొనుగోలు చేసేందుకు గత నెలలో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ దేశంలో వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం భారత్ బయోటెక్ మార్చి 8న దరఖాస్తు చేసుకుంది.
భారత్ తయారు చేసిన వ్యాక్సిన్ 20 మిలియన్ల మోతాదుల దిగుమతి చేసుకోమని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి అభ్యర్థన అందిందని నేషనల్ హెల్త్ సర్వైవలెన్స్ ఏజెన్సీ అన్వీసా తన వెబ్ సైట్లో పేర్కొంది. అయితే, కొన్ని కీలక పత్రాలు లేకపోవడంతో ఆ నియంత్రణ సంస్థ అభ్యర్థనను దరఖాస్తును తిరస్కరించినట్లు తెలిపింది. అయితే, దీనిపై భారత్ బయోటెక్ స్పందించింది. బ్రెజిల్ ఎన్ఆర్ఏతో చర్చలు జరుతుపుతున్నామని పేర్కొంది.
తనిఖీ సమయంలో ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. బ్రెజిల్ ప్రభుత్వం 20 మిలియన్ డోసుల ఆర్డర్ను రద్దు చేయలేదని స్పష్టం చేసింది. భారత్ బయోటెక్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో కొవాగ్జిన్ వ్యాక్సిన్ను రూపొందించింది. జాతీయ డ్రగ్ రెగ్యులేటర్ అత్యవసర వినియోగం కోసం జనవరిలో ఆమోదం తెలిపింది. మొదట టీకాపై క్లినికల్ ట్రయల్ మోడ్ లోగో ఏర్పాటు చేశారు.
మూడో దశ ట్రయల్ పూర్తవగా.. ఇందులో 81శాతం సమర్థవంతంగా పని చేస్తుందని చెప్పడంతో ట్రయల్ మోడ్ లోగోను తొలగించారు. అలాగే వ్యాక్సిన్ యూకే వేరియంట్కు వ్యతిరేకంగా పని చేస్తుందని చెప్పింది. ఇప్పటికే ఇరాన్, నేపాల్, మారిషస్, పరాగ్వే, జింబాబ్వేతో సహా అనేక దేశాలు కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చాయి. ఇంకా టీకా వినియోగం కోసం థాయ్లాండ్, ఫిలిప్పీన్స్, బ్రెజిల్లో కంపెనీ దరఖాస్తు చేసింది. సుమారు 40 దేశాలు కొవాగ్జిన్పై ఆసక్తిని వ్యక్తం చేశాయని భారత్ బయోటెక్ తెలిపింది.