తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల గిరులన్నీ శ్రీనివాసుడి నామస్మరణతో మార్మోగిపోయాయి. ధ్వజారోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ ప్రధాన పూజారి ప్రకటించారు. 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల వాహనాలపై స్వామివారు తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. కరోనా నేపథ్యంలో రెండేండ్ల పాటు బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగాయి.
మీనలగ్నంలో ధ్వజారోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ముక్కోటి దేవతలను స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడమే ధ్వజారోహణంగా సెలవిస్తుంటారు వేదపండితులు. ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తజనం హాజరై కనులారా తిలకించి పులకించిపోయారు. రెండేండ్ల తర్వాత బ్రహ్మోత్సవాలను భక్తుల మధ్య నిర్వహిస్తుండటంతో తిరుమల గిరులు భక్తులతో నిండిపోయింది. స్వామివారిని తిలకించేందుకు వచ్చిన భక్తులకు టీటీడీ సిబ్బంది అన్నదాన ప్రసాదాలను పంపిణీ చేశారు. అధికారులు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కేవలం సర్వదర్శనం మాత్రమే కొనసాగిస్తున్నారు. రాత్రి 8 గంటలకు స్వామి వారికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంపై మాడ వీధుల్లో శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్ప స్వామి సంచరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆలయంతో పాటు రంగనాయకుల మండపం విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోయింది. ఆలయం లోపల వివిధ పువ్వులతో అందంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 3,600 మంది పోలీసులు బందోబస్తులో పెట్టారు. వీరికి తోడుగా టీటీడీ విజిలెన్స్ అధికారులు, సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. వచ్చే నెల 1 వ తేదీన అత్యంత ముఖ్యమైన గరుడ వాహన సేవ జరుగనున్నది. ఈ వాహన సేవకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు.