హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటన పట్ల తెలంగాణ అర్చక సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విజయం సాధించాలని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ ఫలాలు దేశ ప్రజలందరికీ అందాలని కోరుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వెనుకబాటుకు గురైన తెలంగాణ ప్రాంతాన్ని అనతికాలంలోనే అగ్రభాగాన నిలిపి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ సేవలు ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ఎంతో అవసరమని తెలంగాణ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. స్వతంత్ర భారత దేశంలో ఆశించిన స్థాయిలో ప్రగతి సాధ్యం కాలేదని, కేసీఆర్ వంటి ముందుచూపున్న, ప్రగతిశీల నేతతోనే దేశం అగ్రభాగాన నిలిచే వీలు కలుగుతుందని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్తో కలిసి నడుస్తాం
ఉద్యమనేత, సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభినందనలు. తెలంగాణ విధానాలను దేశవ్యాప్తం చేయాలి. ఇక్కడి పథకాలు, సంక్షేమ ఫలాలు అన్ని రాష్ర్టాల వారు అందుకోవాలి. భారతీయులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి. అనేక రాష్ర్టాల్లో కులవృత్తుల పరిస్థితి దయనీయంగా మారింది. కార్పొరేట్ దోస్తుల కోసం మోదీ కులవృత్తులను నిర్వీర్యం చేస్తున్నారు. కేసీఆర్ దేశ రూపురేఖలను మారుస్తారనే నమ్మకం ప్రజల్లో దృఢంగా ఉన్నది. బీఆర్ఎస్కు మద్దతుగా కేసీఆర్తో కలిసి నడుస్తాం.
– సుంకోజు కృష్ణమాచారి, విష్ణుచారి, తెలంగాణ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు