కరోనా మొదలైనప్పటి నుండి సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి మరణ వార్త జీర్ణించుకోకముందే మరో సెలబ్రిటీ కన్నుమూస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు, సినీ ప్రేక్షకులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా ‘మీర్జాపూర్’ సిరీస్తో పాటు ‘సూపర్30’, ‘దంగల్’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మ స్వరూప్ మిశ్రా అనుమానాస్పదంగా మృతి చెందాడు.
ముంబయిలోని వర్సోవా సోసైటీలో అద్దెకుంటుండగా, గత కొన్ని రోజుల నుంచి ఆయన ఇంటినుంచి బయటకి రాలేదని స్థానికులు తెలుపుతున్నారు. అతను ఉంటున్న గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.కాగా సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి ఇంటికి తాళం వేసి ఉంది. డూప్లికేట్ తాళం సహాయంతో ఇంటి తలుపును తెరిచిన పోలీసులకు బ్రహ్మస్వరూప్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభించింది. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహన్ని ఆస్పత్రికి తరలించారు.
కాగా బ్రహ్మ స్వరూప్ గుండెపోటుతో మరణించాడని, రూమ్ లో ఒక్కడే ఉండడంతో ఎవరికి ఈ విషయం తెలియలేదని, దాదాపు మూడురోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. బ్రహ్మ స్వరూప్ మిశ్రా మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. కాగా, మీర్జాపూర్ చిత్రంలో మున్నా భాయ్ కి అనుచరుడిగా నవ్వులు పండించి మంచి పేరుతెచ్చుకున్నారు బ్రహ్మ స్వరూప్ మిశ్రా.