న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో ఘోరం జరిగింది. అక్కను ఏడిపిస్తుంటే అడ్డుకున్న ఓ 17 ఏండ్ల బాలుడిపై ఆకతాయిలు కత్తులతో దాడి చేసి పారిపోయారు. ఈశాన్య ఢిల్లీలోని కాకాజీ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలుడి కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి అక్క ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తాను తన సోదరుడు కలిసి శుక్రవారం పని నిమిత్తం బయటకు వెళ్తుండగా ముగ్గురు యువకులు వారిని వెండించారు. బాధితురాలితో అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు. దాంతో బాధితురాలి తమ్ముడు వారిని ఎదిరించగా ముగ్గురు కలిసి అతనిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం అతడిని కత్తులతో కడుపులో పొడిచి పారిపోయారు. కాగా, నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.