ముంబై: కదులుతున్న రైలులో కొందరు బాలురు ప్రమాదకరంగా స్టంట్లు చేశారు. ఒక స్టేషన్ నుంచి కదిలిన రైలును పరుగెత్తుకుంటా వచ్చి కొందరు యువకులు ఎక్కారు. రైలు బోగి వద్ద ప్రమాదకరంగా వేలాడారు. బోగి రాడ్ను చేతులతో పట్టుకుని కాళ్లను ఫ్లాట్ఫామ్పై ఉంచారు. ట్రైన్ స్టేషన్ దాటిన తర్వాత డేంజరస్గా స్టంట్లు చేశారు. రైల్వే విద్యుత్ స్తంభాల వద్ద చెలగాటమాడారు.
ఒక వ్యక్తి రైలు నుంచి ఒక చేతితో జంప్ చేస్తూ మరో చేతితో విద్యుత్ స్తంభాలను తాకాడు. ఒక చోట గోడ వంటిది రాగా రైలు నుంచి దానిపైకి దూకి పరుగెత్తి మళ్లీ రైలు బోగిలోకి చేరాడు. తర్వాత స్టేషన్ వచ్చే వరకు ప్రమాదకరంగా విన్యాసాలు చేశాడు. అనంతరం ఆ బాలుర బృందం మరో స్టేషన్లో దిగి వెళ్లిపోయింది.
కాగా, మీకు అదనపు జీవితం ఉన్నప్పుడు.. అన్న శీర్షికతో కాజ్ ఇంక్యులో అనే ట్విట్టర్ యూజర్ ఈ నెల 14న పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోవైపు నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రమాదకంగా స్టంట్లు చేసిన బాలుర తీరుపై మండిపడ్డారు.
గతంలో పలువురు ఇలాంటి విన్యాసాలు చేసి గాయపడటంతోపాటు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలను గుర్తు చేసుకున్నారు. కాగా, అధికారులు కూడా ఇలాంటి సాహసాలు చేసే వారిని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు.