వైభవంగా గోల్కొండ జగదాంబిక బోనాలు
రెండో బోనం సమర్పించిన అశేష భక్తజనం
కిటకిటలాడిన గోల్కొండ కోట
నగరం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు
వర్షాన్ని లెక్క చేయక దర్శనం కోసం బారులు
అలరించిన పోతురాజుల విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలు
‘మా అమ్మ ఎల్లమ్మ.. సల్లంగ చూడమ్మా.. మమ్మేలు తల్లి’ అంటూ భక్తుల జయజయధ్వానాలతో గోల్కొండ కోట దద్దరిల్లింది. భారీగా తరలివచ్చిన జనవాహినితో కోట పరిసరాలు కిక్కిరిశాయి. జగదాంబిక దర్శనం కోసం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్దఎత్తున బారులు తీరారు. అమ్మకు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన ఎల్లమ్మ ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రెండో బోనాన్ని సమర్పించారు. ఉదయం నుంచే కోట పరిసరాలు సందడిగా మారాయి. మధ్యాహ్నం కల్లా ఆలయం మార్గం పూర్తిగా నిండిపోయింది. ఓ వైపు జోరు వానలో తడుస్తూనే అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. తొట్టెల ఊరేగింపు.. పోతురాజుల విన్యాసాలు.. కళాకారుల ప్రదర్శనలు భక్తులకు కనువిందు చేశాయి.
మెహిదీపట్నం, జూలై 3 : ఆషాఢమాసం బోనాల రెండో పూజను చారిత్రక గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం ఘనంగా జరిపారు. ఉదయం నుంచే కోటకు నగరం నలువైపుల నుంచి భక్తులు తరలివచ్చారు. కోటలో బోనాలను చేసుకునే వారితో పాటు అమ్మవారి దర్శనానికి వచ్చిన వారితో మొత్తం కోట నిండిపోయింది. జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు ఛైర్మన్ వావిలాల మహేశ్వర్, ఈవో శ్రీనివాస్రాజు, సభ్యులు మోహన్దాస్, ప్రభాకర్రాజు, ఉమ, వినోద్, శ్రీకాంత్ భక్తులకు సేవలు అందించారు. కుల వృత్తుల సంఘం అధ్యక్షుడు బి.సాయిబాబా చారి, నాయకులు శ్రీకాంత్చారి, శివశంకర్, ప్రసాద్, సురేశ్చారి, ఆలయ పూజారి సర్వేశ్వర్ భక్తులకు సహాయసహకారాలు అందించారు. గోల్కొండ పోలీస్స్టేషన్ మైత్రి పీస్ కమిటీ అధ్యక్షులు సిరుగుమల్లె రాజువస్తాద్, నాయకులు, సభ్యులు సమన్వయంతో వ్యవహరించి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు. గోల్కొండ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్రెడ్డి నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కోటలో రెండో బోనం ఏర్పాట్లను కార్వాన్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి ఠాకూర్ జీవన్సింగ్, లంగర్హౌస్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎన్.చంద్రకాంత్తో కలిసి పర్యవేక్షించారు.
గ్రామదేవతలకు కల్లుసాక
చాంద్రాయణగుట్ట, జూలై 3 : ఆషాఢమాసం బోనాల జాతర సందర్భంగా ఉమ్మడి దేవాలయాల వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు పేరోజు మహేశ్వర్ ఆధ్వర్యంలో ఆదివారం లాల్దర్వాజ, గౌలిపురా,చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడతో పాటు అమ్మవార్లకు కొత్త కుండలో వేప ఆకులను వేసి కల్లు సాకపెట్టారు. ఈ కార్యక్రమంలో సంఘం సలహాదారులు వరకాల యాదగిరి, మ్యాదరి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు జ్ఞానేశ్వర్, కోశాధికారి బొడ్డుపల్లి రాజు, సుధాకర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.