ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు..
కళాకారులు, పోతురాజులు, శివసత్తులతో బోనాల ఊరేగింపు..
నేటి నుంచి 6వరకు ప్రత్యేక కార్యక్రమాలు
హాజరు కానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు
చాంద్రాయణగుట్ట, జూలై 3: పాతబస్తీలో చారిత్రాత్మకమైన లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రతియేటా ఢిల్లీలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు ఆలయ చైర్మన్ శీరా రాజ్కుమార్ సారథ్యంలో ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శీరా రాజ్ కుమార్ మాట్లాడుతూ నిజాం కాలం నుంచి అమ్మవారి ఆలయానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఢిల్లీలో బోనాల జాతర నిర్వహిస్తామని అప్పట్లో నిర్ణయించమని చెప్పారు.
అమ్మవారి దయవల్ల తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రతియేటా ఆషాఢమాసంలో ఢిల్లీ గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు కళకారులు, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాల నడుమ అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం కన్నుల పండువగా కొనసాగుతుందని అన్నారు. ఈ నెల 4నుంచి 6వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు హజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాలు విజయవంతం అయ్యేందుకు ఫోర్మెన్ కమిటీ సభ్యులు ఉత్సాహంగా పని చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.