ఔరంగాబాద్: కోవిడ్ లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలకు హాజరువుతున్న రాజకీయ నేతలపై బాంబే హైకోర్టు ఔరంగాబాద్ ధర్మాసనం మండిపడింది. నిబంధనలు పేదల కోసమేనా.. పెద్దలకు వర్తించవా అని ప్రశ్నించింది. కోవిడ్ సంబంధిత అంశాలపై న్యాయమూర్తులు ఆర్వీ ఘూగే, బీయూ దేబడవార్తో కూడిన ధర్మాసనం ఐచ్ఛికంగా చేపట్టిన విచారణ సందర్భంగా శివసేనకు చెందిన రాష్ట్రమంత్రి సందీపన్ భుమరే వివిధ కార్యక్రమాలకు హాజరు కావడం గురించిన ప్రస్తావన వచ్చింది. మంత్రి ఓ ప్రారంభోత్సవంలో స్వయంగా పాల్గొన్నారని న్యాయవాది ఒకరు కోర్టు దృష్టికి తెచ్చారు. భౌతికంగా రాజకీయానేతలు, మంత్రులు ఎలాంటి కార్యక్రమాలకు, సమావేశాలకు హాజరు కావొద్దని ఆదేశాలు జారీచేయాల్సి వస్తున్నదని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయొద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసిన సంగతిని కోర్టు గుర్తు చేసింది. అయినా జరుగుతూనే ఉన్నాయని, నియమాలు ఉల్లంఘించిన రాజకీయ నేతపై ఎలాంటి చర్య తీసుకున్న దాఖలాలు లేవని తెలిపింది. ఏమిటిదంతా? రాజకీయనేతలు-పోలీసుల కుమ్మక్కు ఫలితమా? అని కోర్టు మండిపడింది. సదరు కార్యక్రమంపై ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ, అందులో మంత్రి పేరు ప్రస్తావించలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. మంత్రి అనుమతితోనే సదరు కార్యక్రమం జరిగిందని అర్థమవుతూనే ఉందని, ఫొటోల్లో చూస్తే మంత్రి ముక్కు మీద ఉండాల్సిన మాస్కు ఎక్కువసేపు గదువ కిందకే ఉన్నట్టు తెలుస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.