న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పూల మార్కెట్ వద్ద శుక్రవారం ఉదయం కలకలం రేగింది. అనుమానిత బ్యాగులో బాంబును గుర్తించారు. దీంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. తూర్పు ఢిల్లీ పరిధిలోని ఘాజీపూర్ పూల మార్కెట్లో ఈ ఘటన జరిగింది. ఒక చోట పడేసి ఉన్న బ్యాగును గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ)ని రంగంలోకి దింపారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఆ బాంబును సురక్షితంగా పేల్చివేసింది. దీంతో అంతా ఊరట చెందారు.
కాగా, ఘాజీపూర్ పూల మార్కెట్ వద్ద లభించిన అనుమానిత బ్యాగులో ఐఈడీ ఉన్నదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా తెలిపారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్తో పాటు ఇతర విభాగాలు అక్కడకు చేరుకుని బాంబును నిర్వీర్యం చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నదని వెల్లడించారు.