కరోనా వైరస్ కేవలం తెలుగు ఇండస్ట్రీనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీని నాశనం చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వేల కోట్ల రూపాయల నుంచి పదుల సంఖ్యలో వచ్చే కోట్ల వరకు దిగజారి పోయేలా చేసింది. మరీ ముఖ్యంగా ఇండియన్ సినిమా ఈ వైరస్ ధాటికి విలవిలలాడి పోయింది. భారతీయ సినీ పరిశ్రమలో సింహభాగం బాలీవుడ్ నుంచి వస్తుంది. అక్కడి సినిమాలు వేల కోట్ల బిజినెస్ చేస్తుంటాయి. కానీ కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లుగా బాలీవుడ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. పదుల సంఖ్యలో భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరోలు నటించిన ఈ సినిమాల బిజినెస్ దాదాపు 1000 కోట్లకు పైగానే జరిగింది. కానీ కరోనా వైరస్ కారణంగా కుదేలయ్యాయి.
2019 లో బాలీవుడ్ మార్కెట్ 4000 కోట్లకు పైగానే ఉంది. అప్పుడు పరిస్థితులు అన్నీ బాగున్నాయి కాబట్టి అనుకున్న టైం కు అన్ని సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని సంచలన విజయం సాధించాయి. కానీ 2020కి వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. భారత్ లో కరోనా విలయతాండవం చేసే సరికి 8 నెలలు థియేటర్లను మూసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడైనా సినిమాలు విడుదల చేసుకుందామంటే వైరస్ రెండోదశ మొదలైపోయింది. ముఖ్యంగా మహారాష్ట్ర లో రోజుకు 30 వేల కేసులు వస్తున్నాయి. దాంతో మళ్ళీ లాక్ డౌన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విడుదలకు సిద్ధమైన తమ సినిమాలను మరోసారి వాయిదా వేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.
ఏప్రిల్ 30న రావాల్సిన అక్షయ్ కుమార్ సూర్య వంశీ అనుకున్న సమయానికి విడుదల అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అప్పటికే ఉన్న పరిస్థితులు చూసి తన సినిమా విడుదల తేది గురించి ఆలోచిద్దాం అంటున్నారు నిర్మాతలు. ఇప్పటికే కొన్ని భారీ సినిమాలు కొత్త విడుదల తేదీ కోసం చూసుకుంటున్నాయి. అందులో బంటీ ఔర్ బబ్లీ 2, 1983 లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. 2020లో బాలీవుడ్ మార్కెట్ 400 వందల కోట్లకు పడిపోయింది. అంటే నికరంగా 3,600 కోట్ల నష్టం అన్నమాట. 2021లో పరిస్థితి ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు నిర్మాతలు. దీనికి సమాధానం కాలమే చెప్పాలి.