న్యూఢిల్లీ: ఇదిగో అదుగో అంటూ టెక్ కంపెనీలు ఊరిస్తున్న 5-జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా ప్రముఖ బాలీవుడ్ నటి, పర్యావరణ కార్యకర్త జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 5-జీ వైఫై టెక్నాలజీ వల్ల విడదలయ్యే రేడియేషన్ ప్రజలకు, పర్యావరణానికి హానికరమని ఆమె తన పిటిషన్లో తెలిపారు. ఈ విషయమై ఒక మీడియా ప్రకటన విడుదల చేస్తూ సాంకేతిక పురోగతికి తాను వ్యతిరేకం కాదని జూహీ స్పష్టం చేశారు. వైర్లెస్ కమ్యూనికేషన్స్తో సహా ఆధునిక టెక్నాలజీని అందరమూ ఇష్టపడతామని, అయితే కొత్తగా తెస్తున్న 5-జీ వల్ల ప్రజల ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు ఏర్పడుతుందని చెప్పడానికి తగిన కారణాలు ఉన్నాయని అన్నారు. మనుషులకే కాకుండా పశుపక్ష్యాదులకు కొత్త టెక్నాలజీ హానికరం కాదని సంబంధిత విభాగం ధ్రువీకరించాలని జూహీ తన పిటిషన్ లో డిమాండ్ చేశారు. ప్రస్తుత కాలంలోనే కాకుడా, రాబోయే కాలంలో కూడా ఈ టెక్నాలజీ సురక్షితమా అనేది అధ్యయనం చేయాలని కోరారు. ఇందులో ప్రైవేటు వ్యాపార సంస్థల భాగస్వామ్యం ఉండరాదని పేర్కొన్నారు.