కరీంనగర్, మే 27 (నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్రం రాకముందు బ్రిటీషోళ్లు దేశ ప్రజలను ప్రాంతాల వారీగా విభజించి అధికారం చెలాయించారని, ఇప్పుడు మెజార్టీ, మైనార్టీ పేరుతో ప్రజలను విభజించి బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తున్నదని, వాళ్లకు వీళ్లకు తేడాలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ మతిభ్రమించి మాట్లాడుతూ మతాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై రాజ్యాంగ బద్ధమైన ప్రధాని పదవిలో ఉన్న మోదీ తన బాధ్యతలను మరిచి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా, పార్లమెంటరీ విధానంలో సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంపై మోదీ ఆది నుంచి విషం చిమ్ముతూనే ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు గుజరాత్కు సీఎంగా ఉన్న మోదీకి ఇక్కడ జరిగిన ఉద్యమం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో మోదీ పార్లమెంట్లో తన ప్రసంగంలో తల్లిని చంపి, బిడ్డను బతికించారని ఏపీ విభజనపై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. మొదటి పార్లమెంట్ సమావేశాల్లోనే ఆంధ్రాకు అనుకూలంగా మాట్లాడారని, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను, 500 మెగావాట్ల సీలేరు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్రాకు కట్టబెట్టారని, ఈ సమయంలో పార్లమెంట్లో తామెంత మొత్తుకున్నా వినిపించుకోలేదని వినోద్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మోదీ ఇప్పుడు తెలంగాణను అభివృద్ధి చేస్తానని చెప్పడం సిగ్గు చేటన్నారు.
టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని విమర్శించే ముందు తన పార్టీలో ఎంతమంది వారసత్వంగా రాజకీయాల్లో వచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచారో చూసుకోవాలని హితవుపలికారు. హైదరాబాద్లోని ఐఎస్బీ విద్యార్థులకు విషం నూరి పోసే ప్రయత్నం చేశారని, స్వచ్ఛ భారత్ గురించి చెప్పినప్పుడు దేశంలోనే తెలంగాణలో అవార్డులకు ఎంపికైన 19 గ్రామాల గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తెలంగాణలోని అభివృద్ధి, విద్యా విధానం, రోడ్ల అభివృద్ధి గురించి ఎందుకు వివరించ లేదని అడిగారు.
2014 నుంచి ఇప్పటివరకు దేశంలో చెప్పుకోదగిన పథకం ఒక్కటీ అందించని మోదీ అనేక విషయాల్లో విఫలమయ్యారని, పెద్ద నోట్ల రద్దే ఇందుకు నిదర్శనమని దుయ్యబట్టారు. జనధన్ పథకం వల్ల ఎవరికి లాభం జరిగిందని ప్రశ్నించారు. అసలు మోదీకి ఏ ఒక్క విషయం మీద కనీస అవగాహన లేదన్నారు. 140 కోట్ల దేశ జనాభాలో 70 కోట్ల మంది 25 ఏండ్ల వయసు వాళ్లే ఉన్నారని, వీళ్ల భవిష్యత్తు కోసం ఆలోచించకుండా మత విద్వేషాలు, కుల వైషమ్యాలను పెంచేందుకు నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
మోదీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలో దేశాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. బ్యాంకులను ప్రైవేటీకరించడం, ఎల్ఐసీ ఆస్తులు వేలానికి పెట్టడం, రైల్వేలను అమ్మేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇదే జరిగితే అదానీ, అంబానీ రైళ్లు వస్తాయని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాలు దొరకవని ఆయన స్పష్టం చేశారు. ఒక్క నీటి పారుదల ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించ లేదని, బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, గుజరాత్లో మాత్రం జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించిన విషయాన్ని గుర్తుచేశారు. సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు.