అంబేడ్కర్ కోనసీమ జిల్లా : వాతావరణంలో మార్పుల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉన్నది. చేపల వేటకు వెళ్లొద్దని ఏపీ అధికారులు గత కొన్ని రోజులుగా హెచ్చరిస్తున్నారు. అయినా వారి సూచనలు పెడచెవిన పెట్టి పలువురు చేపల వేటకు వెళ్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అంబేడ్కర్కోనసీమ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో తిరగబడటంతో ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. బోటులోని మిగతా నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన అల్లవరం మండలం ఓడలరేవు సాగర సంగమం వద్ద చోటుచేసుకుంది.
ఓడలరేవులోని జెట్టి నుంచి శనివార ఉదయం ఐదుగురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు ఓ బోటులో బయలుదేరారు. సముద్రంలోకి వెళ్లిన కొద్దిసేపటికే గాలి తీవ్రత కారణంగా సముద్ర అలలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో బోటు తిరగబడింది. దాంతో బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సముద్రంలో పడిపోయారు. నలుగురు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. కాగా, ఒక మత్స్యకారుడు అలల తాకిడి ఎక్కువై ఒడ్డుకు చేరలేక మృతి చెందారు.
బోటులో చేపల వేటకు వెళ్లినవారు కాకినాడకు చెందిన మత్స్యకారులుగా తెలిసింది. ఓడలరేవు సాగర సంగమం వద్ద తిరగబడిన బోటును స్థానిక మత్స్యకారులు కలిసి తీరానికి చేర్చారు. సముద్రం నుంచి ఈదుకుంటూ నలుగురు ఒడ్డుకు చేరడంతో అక్కడి వారు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఐదో వ్యక్తి మరణించడంతో విషాదం అలుముకున్నది. మత్స్యకారుడి మృతదేహం ఒడ్డుకు చేరిన తర్వాత ప్రైవేటు వాహనంలో స్థానిక మత్స్యకారులు వారి స్వగ్రామానికి తరలించారు.