చిన్నపిల్లలనుంచి మొదలుకొని, పెద్దల దాకా ప్రతిఒక్కరూ రోజులో అధిక సమయం టీవీ, మొబైల్, ల్యాప్టాప్కే అతుక్కుపోతున్నారు. గ్యాడ్జెట్ లేనిదే రోజువారీ జీవనం సాగడం లేదు. అయితే, ఇలాంటి వారికి ఊబకాయంతోపాటు మానసిక సమస్యలు తప్పవని తాజా అధ్యయనంలో తేలింది. అధిక స్క్రీన్ టైం వల్ల వారు బ్లూ లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారని, దీంతో ఊబకాయం, మానసిక సమస్యలతోపాటు త్వరగా వృద్ధాప్య లక్షణాలు వస్తున్నాయని పరిశోధకులు తేల్చారు.
ఈ అధ్యయనాన్ని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించారు. పండు ఈగలపై అధ్యయనం నిర్వహించారు. టీవీలు, ల్యాప్టాప్లు, ఫోన్ల నుంచి వెలువడే బ్లూ లైట్ వల్ల చర్మం, కొవ్వు కణాల నుంచి సెన్సరీ న్యూరాన్ల వరకు శరీరంలోని విస్తృత శ్రేణి కణాలపై హానికరమైన ప్రభావం పడుతుందని గుర్తించినట్టు పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ జాడ్విగా గిబుల్టోవిచ్ తెలిపారు. బ్లూ లైట్ మన ప్రాథమిక జీవసంబంధమైన విధులపై ప్రభావం చూపుతుందని కనుగొన్నామన్నారు. ఈగలు, మానవుల కణాలలో సిగ్నలింగ్ రసాయనాలు ఒకే విధంగా ఉంటాయని గిబుల్టోవిచ్ వివరించారు. ఈ అధ్యయన ఫలితాలు ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్లో ప్రచురితమయ్యాయి.