హైదరాబాద్, జూన్ 18(నమస్తే తెలంగాణ): మూగజీవాల ఆరోగ్యరక్షణ కోసం యానిమల్ బ్లడ్ బ్యాంక్, రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు అవసరం ఎంతో ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బీ వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు. శనివారం మంత్రుల నివాసంలో వినోద్తో ఆల్ ఫర్ యానిమల్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీలక్ష్మీభూపాల్, యానిమల్ బ్లడ్ లైన్ ఫౌండర్ శివ కుమార్వర్మ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జంతువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వపరంగా ఎన్జీవోలకు చేయూతపై చర్చించారు.
ఆవులు, బర్రెలు, కుకలు, పిల్లులు తదితర జంతువులు రక్తహీనతకు గురైనప్పుడు, ప్రమాదాల్లో రక్తస్రావమైనప్పుడు రక్తం అందుబాటులో లేక ప్రాణాలు పోతున్నాయని శ్రీలక్ష్మీభూపాల్, శివకుమార్ వివరించారు. రాష్ట్రంలో ఎన్జీవోలకు అమెరికా, యూకే తరహాలో యానిమల్ ఫౌండేషన్లు, బ్లడ్బ్యాంక్ మాదిరిగా నిర్వహణ నైపుణ్యాన్ని, అవసరమైన ల్యాబ్ సామాగ్రి, శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, సహకారం కావాలని వినోద్ను కోరారు. రాజేంద్రనగర్లోని పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీలో జంతువుల బ్లడ్బ్యాంక్, రిసెర్చ్ సెంటర్ నెలకొల్పే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ తెలిపారు. పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, వెటర్నరీ వర్సిటీ వీసీ రవీందర్రెడ్డితో మాట్లాడి, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.