న్యూఢిల్లీ: ఓవైపు కరోనాతో భీకర పోరాటం జరుగుతుంటే మధ్యలో బ్లాక్ ఫంగస్ వచ్చి దూరింది. తర్వాత యెల్లో, వైట్ అని రకరకాల రంగుల్ల్లో ఈ ఫంగస్లు కనిపించడం మొదలైంది. కానీ బ్లాక్ ఫంగస్ ఒక్కటే నోటిఫైడ్ జాబితాకు ఎక్కింది. దీనికి ప్రత్యేకమైన చికిత్సలు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇంతకూ కోవిడ్ నుంచి కోలుకున్న వారికే వస్తుందా లేక ఫ్రిజ్ల నుంచి, మసిబారిన ఉల్లిపాయల నుంచి అందరికీ వస్తుందా అనే సందేహాలు, భయాలు ఈ మధ్యన ఎక్కువయ్యాయి.
ముఖ్యంగా సోషల్ మీడియాలో భయపెట్టే కథనాలు కోకొల్లలుగా వస్తున్నాయి. ఇటీవల ఓ పోస్టు విపరీతంగా చక్కర్లు కొడుతున్నది. ఇంట్లోని మామూలు వస్తువులతో ఈ ఫంగస్ వస్తుందని దాని సారాంశం. ఫ్రిజ్లో పెట్టిన మామూలు కూరగాయలు, చివరకు ఉల్లిపాయలతో బ్లాక్ పంగస్ వస్తుందని బెదరగొట్టేసింది సదరు పోస్టు. దాని సారాంశం ఇలా ఉంది.. “మార్కెట్లో కూరగాయలు కొంటున్నారా.. వాటిని ఫ్రిజ్ లో పెడుతున్నారా.. అయితే జాగ్రత్త. వాటి మీద ఉండే నల్లని మసి లేదా నల్లని ఫంగస్ మ్యూకర్మైకోసిస్ కలిగించవచ్చు”. వంటలు చేసి ఫ్రిజ్లో పెట్టినా వాటిద్వారా కూడా ఈ ఉల్లి ఫంగస్ వ్యాపిస్తుందని పోస్టు రచయితలు బెదరగొట్టేశారు.
ఈ పోస్టు పూర్తిగా సత్యదూరమైంది. ఏవో కొన్ని వస్తువుల ద్వారా బ్లాక్ ఫంగస్ వ్యాపించదు. ఇందులో చెప్పినట్టుగా కూరగాయలు, పండ్ల ద్వారా అది మనిషికి సోకదు. ప్రిజ్ లోపెరిగే నాచు, ఉల్లిపాయ పొట్టుమీద ఉండే నల్లని మసి బ్లాక్ ఫంగస్ ఒకటి కాదు. ఫ్రిజ్ి లోని నాచు బ్యాక్టీరియా, యీస్ట్ వల్ల ఏర్పడిందే. అవీ ప్రమాదకరమే. ఆహారం కలుషితం అయ్యేందుకు అవి కారణం కావచ్చు. వాటివల్ల ప్రత్యేకమైన జబ్బులేమీ రావు అలాగే ఉల్లిపాయల పొట్టు మీద ఉండే మసి జబ్బులకు దారితీయడం అనేది అరుదైన విషయం. ఏది ఏమైనా కూరగాయలను బాగా కడగాలనే నియమం ఎటూ ఉండడనే ఉందిగా. ఇకపోతే బ్లాక్ ఫంగస్ అనేది అందరికీ సోకదు.
తీవ్రమైన, అదుపులేని మధుమేహం, రోగనిరోధకతను తొక్కిపెట్టే స్టెరాయిడ్ల వాడకం వంటివి బ్లాక్ ఫంగస్కు దారితీయవచ్చునని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ముక్కులోని శాంపిల్ తీసి పరీక్షించడం ద్వారా బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ను ధ్రువీకరించవచ్చు. దానికీ మందులున్నాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి తప్ప అందరికీ దానివల్ల పెద్దగా ప్రమాదమూ ఉండదు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను నమ్మకుండా వైద్యుల సలహా తీసుకోవడమే అన్నివిధాలా ఉత్తమం.