కోల్కతా, సెప్టెంబర్ 13: జాతీయ పార్టీ అది.. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. దేశంలో, రాష్ర్టాల్లో శాంతి భద్రతలు కాపాడాల్సింది పోయి విధ్వంసానికి పాల్పడింది.. బీజేపీ. బీజేపీ నేతలు బెంగాల్ రాజధాని కోల్కతాలో మంగళవారం ప్రవర్తించిన తీరు వీధి రౌడీలను తలపించిందని నెటిజన్లు మండిపడుతున్నారు. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి, బీజేపీ హుగ్లీ ఎంపీ లాకెట్ చటర్జీ, పార్టీ సీనియర్ నేత రాహుల్ సిన్హా తదితరులు అధికార టీఎంసీవి అవినీతి విధానాలంటూ సచివాలయ ముట్టడికి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు ఏకంగా పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారు.
పోలీసు వాహనాలతోపాటు ఇతర వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మరీ ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి వెళ్లాక పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ విధ్వంస కాండలో పలువురు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను దాటుకొంటూ బీజేపీ నేతలు ముందుకు సాగుతూ, పోలీసులతోనే ఘర్షణకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. హౌరా బ్రిడ్జి, ఎంజీ రోడ్డు, లాల్బజార్ ప్రాంతాల్లోనూ బీజేపీ కార్యకర్తలు విధ్వంసాలకు తెగబడ్డారు. లాల్బజార్లో పోలీస్ వాహనానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనల్లో చాలా మంది పోలీసులు గాయపడ్డారని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ చేయి విరిగిందని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు విధ్వంసానికి దిగటంతో సామాన్య ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురైనట్టు పేర్కొన్నారు. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు సృష్టించిన విధ్వంసం దేశానికి తలవంపులు తెచ్చిందని, ఇలాంటి దారుణమైన ప్రవర్తనను ఖండిస్తున్నట్టు టీఎంసీ ట్విట్టర్లో తెలిపింది. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు పోకిరీలుగా ప్రవర్తించారని తీవ్రంగా మండిపడింది.
పోలీసులపై తెగబడి..
సచివాలయ ముట్టడి కోసం బీజేపీ పలు రైళ్లలో కార్యకర్తలను కోల్కతాకు తరలించింది. బస్సుల్లో, బోట్లలో హౌరాకు తరలివచ్చిన ఆందోళనకారులు ర్యాలీలో పాల్గొన్నారు. అనుమతి లేని ర్యాలీని అడ్డుకొనేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటుచేస్తే వాటిని దాటుకొంటూ వెళ్లి మరీ బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కనిపించిన పోలీసును పరుగెత్తించి కొట్టారు. ఈ ఘటనలో మొత్తం 56 మంది పోలీసులు గాయపడ్డారు. అందులో ఒకరు ఐసీయూలో, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న బీజేపీ.. ఇలాంటి చర్యలకు దిగటం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు.