హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 4: హుజూరాబాద్లో గొడవలు జరిగేలా బీజేపీ ప్రేరేపిస్తున్నది. ఆ పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రెచ్చిపోయేలా ప్రవర్తిస్తున్నారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి విసిరిన నేపథ్యంలో గురువారం స్థానిక అంబేదర్ చౌరస్తా వద్దకు ముందుగా టీఆర్ఎస్ నాయకులు తమ జెండాలను పట్టుకొని వచ్చి అంబేదర్ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేశారు. తర్వాత బీజేపీ నాయకులు కావాలని అక్కడికి వచ్చి టీఆర్ఎస్ జెండాల మధ్య తమ పార్టీ జెండాలు కట్టారు. దీనికి ప్రతిగా టీఆర్ఎస్ నాయకులు సైతం వాటి పకనే తమ జెండాలను కూడా పెట్టారు.
ఈ సమయంలోనే ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ముందుగా నినాదాలు చేయగా, ఆ వెంటనే ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలకు మధ్య వాగ్వాదం తీవ్రస్థాయిలో జరిగింది. ఒకరిని ఒకరు దూషించుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది. మాటకు మాట పెరిగి కర్రలతో దాడికి దిగారు. ఈ సమయంలో పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నంలో హుజురాబాద్టౌన్ సీఐ వీరబత్తిని శ్రీనివాస్ ముఖంపై స్వల్ప గాయమైంది. పోలీసులు రెండు పార్టీల నాయకులను చెదరగొట్టి గొడవను శాంతింపజేశారు. అంబేదర్ విగ్రహం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.