Rift in Karnataka BJP | కర్ణాటకలోని అధికార బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పనితీరుపై సాక్షాత్ మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలపై ఇతర క్యాబినెట్ మంత్రులు మండిపడుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధుస్వామిని క్యాబినెట్ నుంచి తొలగించాలని కోరుతున్నారు. ఒక హత్య కేసులో నిందితుడిని వక్ఫ్బోర్డులో నియమించడంపై బస్వరాజు బొమ్మై సర్కార్ విమర్శల పాలైంది. ఇది జరిగిన కొన్ని రోజులకే తమ ప్రభుత్వం సరిగ్గా పని చేయడం లేదంటూ బొమ్మై క్యాబినెట్ మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యల ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలైంది. కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా మధుస్వామి వ్యాఖ్యలు సరి కాదని హార్టికల్చర్శాఖ మంత్రి మునిరత్న పేర్కొన్నారు. క్యాబినెట్లో మంత్రిగా మధుస్వామి ఇటువంటి వ్యాఖ్యలుచేయడం సమంజసం కాదన్నారు.
ఒకవేళ ఆయన చెప్పినట్లు ప్రభుత్వం సరిగ్గా పనిచేయకపోతే, ఆయన కూడా దానికి బాధ్యుడే. అటువంటి ప్రకటనలు చేయడానికి ముందు మంత్రిగా వైదొలగాలి. ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో ఉంటే ఆయన రాజీనామా చేయాలి అని మునిరత్న అన్నారు. చెన్నపట్న వాసి భాస్కర్ అనే వ్యక్తికి, మంత్రి మధుస్వామికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో క్లిప్ సోషల్ మీడియకు లీకైంది.
సదరు భాస్కర్ అనే వ్యక్తితో మధుస్వామి ఫోన్లో మాట్లాడుతూ.. `మా ప్రభుత్వం పని చేయడం లేదు. మాకు కేవలం (రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు) ఎనిమిది నెలల గడువు మాత్రమే ఉంది` అని చెప్పారు. రూ.50 వేల విలువైన రుణాల రెన్యూవల్కు కోఆపరేటివ్ బ్యాంకులు రూ.1,300 చార్జీ వసూలు చేస్తున్నారని, సదరు బ్యాంకులపై చర్య తీసుకోవాలని కోరుతూ మంత్రి మధుస్వామికి ఫిర్యాదు చేశారు. `ఈ విషయాలన్నీ నాకు తెలుసు. సహకార మంత్రి ఎస్టీ సోమశేఖర్ దృష్టికి ఈ అంశం తీసుకొచ్చా. ఆయన సరిగ్గా పని చేయడం లేదు` అని మంత్రి మధుస్వామి అన్నట్లు ఆ ఆడియో క్లిప్లో ఉంది.
దీనిపై మైసూర్లో ఉన్న మంత్రి సోమశేఖర్ భగ్గుమన్నారు. తన సహచర మంత్రి మధు స్వామి తాను మాత్రమే తెలివైన వాడినన్న భ్రాంతిలో ఉన్నారని ఆరోపించారు. తెలివి గల మంత్రి అయితే ఈ భ్రాంతి నుంచి బయటకు రావాలని సూచించారు. అయితే, రైతుల నుంచి సహకార బ్యాంకులు వసూలు చేసే ఫీజుల గురించి దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు.
ఈ వివాదంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. బస్వరాజు బొమ్మై ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏం కావాలని పేర్కొంది. మంత్రి మధు స్వామి తమ ప్రభుత్వం అసహాయ స్థితిలో ఉందని ఆరోపిస్తున్నారా? అని ప్రశ్నించింది.