జేపీ నడ్డా.. 2016లో మునుగోడుకు వచ్చి 300 పడకల దవాఖాన కడతానని, ఫ్లోరైడ్ బాధితులకు సామాజిక భద్రత కల్పిస్తానని, ఆదుకొంటానని చెప్పి ఒక పని కూడా చేయలేదు. దానికి స్థానికులు ఆయన సమాధి కట్టి నిరసన తెలిపితే బీజేపీ వాళ్లకు అంత రోషం ఎందుకు? దమ్ముంటే తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలి. -మంత్రి కేటీఆర్
తెలంగాణ భవన్లో గురువారం బూడిద భిక్షమయ్యగౌడ్కు పార్టీ కండువా వేసి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. చిత్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఓ నీతి, జాతి లేని పార్టీ అని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధనబలంతో.. ధన మదంతో మునుగో డు ప్రజలను గెలవాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాబలంతో గెలవలేక రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డుపెట్టుకొని శిఖండి రాజకీయం చేస్తున్నదని దుయ్యబట్టారు. బీజేపీ నేతలకు దమ్ముంటే తెలంగాణకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. బీజేపీ వికృత విధానాలను సహించలేక ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ గురువారం తెలంగాణ భవన్లో మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతోపాటు మర్రిగూడ మండల మాజీ ఎంపీపీ అనంతరాజు, చౌటుప్పల్ మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ మల్లేశం, 6వ వార్డు కౌన్సిలర్ నాగరాజు తదితరులు టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఊరుకోబోమంటూ మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, ఆయన అనుచరులు పార్టీలోకి వస్తున్నందుకు హృదయపూర్వక స్వాగతం పలికారు. రాష్ట్రంలో బీజేపీ ఒక విష సంస్కృతికి తెరలేపిందన్నారు. నల్లగొండ ప్రజలను ధన బలంతో, మునుగోడు ప్రజలను ధన మదంతో గెలవాలని ఆ పార్టీ చూస్తున్నదని మండిపడ్డారు. నల్లగొండ ప్రజలు చైతన్యవంతులని, నాగార్జునసాగర్, హుజూర్నగర్ ఫలితమే ఇక్కడా పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తారని, తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయి వచ్చిన ఉద్యమ బిడ్డ కూసుకుంట్లను ప్రజలు గుండెలకు హత్తుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నిక తెలంగాణ భవితవ్యంపై తీవ్రంగా ప్రభావం చూపే ఎన్నిక అని.. చైతన్యంతో, విజ్ఞతతో కూడిన తీర్పు ఇవ్వాలని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘దేశానికి అత్యధిక ద్రవ్యోల్బణాన్ని అందించిన ప్రధానికి.. అత్యధిక నిరుద్యోగిత రేటు అందించిన ప్రధానికి.. ప్రపంచంలోనే అధిక ధరకు గ్యాస్ బండను అమ్ముతున్న ప్రధానికి.. ఆకలి సూచీలో 116 దేశాల్లో భారత్ను 107 స్థానానికి పడేసిన ప్రధాని మోదీకి తిరుగులేని విధంగా బుద్ధి చెప్పాలి’ అని కోరారు. బీజేపీ ఉన్మాద ప్రవర్తనను దీటుగా ఎదురొనే బాధ్యత అందరిపై ఉన్నదన్నారు.
చేసినం..చెప్తం
చరిత్రలో లేని విధంగా 5% జీఎస్టీ వేసి నేత కార్మికులకు మోదీ మరణ శాసనం రాసిండు. మేము చేనేత బీమా అమలు చేస్తున్నం. నేతన్నలకు అండగా ఉంటున్నం. కాబట్టి నేతన్నలు మాతో ఉండండి అని చెప్పిన. పవర్లూం బోర్డు రద్దుతోపాటు చేనేత కార్మికులకు మరణశాసనం రాస్తున్న పార్టీని వదిలి రావాలని అడిగిన. ఇందులో తప్పేమున్నది? బరాబర్ అడుగుత.
దేశంలో మోదీ రాజ్యాంగం
దేశంలో వ్యవస్థలన్నీ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా చెప్పినట్టు ఆడుతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో అంబేదర్ రాజ్యాంగం నడవటం లేదని మోదీ రాజ్యాంగం నడుస్తున్నదని మండిపడ్డారు. ఈసీ, ఈడీ, సీబీఐ బీజేపీ అనుబంధ సంస్థలుగా, తోక సంస్థలుగా మారిపోయాయని ఆగ్రహించారు. అందుకే మునుగోడులో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేక వ్యవస్థలను అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయంచేస్తూ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
ఫ్లోరోసిస్ను తరిమికొట్టింది టీఆర్ఎస్
ఫ్లోరోసిస్ నుంచి ప్రజలను విముక్తి చేసింది.. ఆరు దశాబ్దాల్లో కానిది ఐదేండ్లలోనే చేసి చూపించింది.. టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్వయంగా పార్లమెంట్లో చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణలో 2014కు ముందు వెయ్యి గ్రామాల్లో ఫ్లోరైడ్ జాడలు ఉండేవని, 2018 తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఫ్లోరైడ్ను రూపుమాపిందని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఫ్లోరైడ్ను తరిమికొట్టిన మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సూచిస్తే కేంద్రం 19 పైసలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఫ్లోరోసిస్ బాధితుడైన అంశల స్వామిని గతంలో ప్రధాని వాజపేయి టేబుల్ మీద కూర్చోబెట్టి పరిస్థితి వివరించినా సమస్యను నిర్మూలించకపోయారని తెలిపారు. నాడు వాజపేయి, నేడు మోదీ ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు.
దమ్ముంటే తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలి
తాము ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేశామని బరాబర్ చెప్పి ఓట్లడుగుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడులో 2.40 లక్షల ఓటర్లు ఉంటే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు 2,38,915 మంది ఉన్నారన్నారు. 99.15% మందికి లబ్ధి చేకూర్చుతున్న పాలన తమదన్నారు. మోదీకిగానీ, కిషన్రెడ్డికిగానీ, బండి సంజయ్కిగానీ, నడ్డాకిగానీ ధైర్యముంటే తెలంగాణకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ను తిట్టడం కాదని.. ఆయన కంటే ఎకువగా తెలంగాణ ప్రజలను ప్రేమిస్తే పన్నుల్లో వాటా, ప్రాజెక్టులు, నిధుల మంజూరులో చూపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ మునుగోడులో ఏం చేశాయని ప్రశ్నించారు. ‘హుజూరాబాద్, దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో రూ.3 వేల పెన్షన్ ఇస్తామన్నారు. ఇస్తున్నారా? గుజరాత్లో ఇప్పటికీ రూ.750 పెన్షన్ ఇస్తున్నారు. బొంకుడు మాటలతో ప్రజల్ని మాయ చేయలేరు’ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మూతిమీద తన్నినట్టు చైతన్యాన్ని చూపిస్తారని స్పష్టంచేశారు.
కిషన్రెడ్డి.. నిస్సహాయ మంత్రి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అవగాహన చూసి తిట్టాలో, నవ్వాలో అర్థం కావడం లేదని, ఆయనపై జాలి కలుగుతున్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తే.. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి సీతాఫల్మండి రైల్వే స్టేషన్లో నాలుగు ప్యాసింజర్ లిఫ్ట్లను ప్రారంభించారని చురకలేశారు. ప్రధాని మోదీ ధైర్యంగా వ్యాక్సిన్ను కనుగొన్నారంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారని.. అదీ ఆయన స్థాయి అని ఎద్దేవాచేశారు. కిషన్రెడ్డి నిస్సహాయ మంత్రి అని, ఎవరైనా రాసిస్తే తప్ప మాట్లాడలేరని చెప్పారు.
కేసీఆర్ను అడ్డుకునే కుయుక్తులు: మంత్రి జగదీశ్రెడ్డి
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లకుండా అడ్డుకొనేందుకే బీజేపీ ఇలాంటి ఉప ఎన్నికలు తెస్తున్నదని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణలో అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటున్నదని చెప్పారు. అనేక రాష్ర్టాల్లో శాసనసభ్యులను కొని అక్రమ పద్ధతిలో ప్రభుత్వాలను పడగొడుతున్నదని, తెలంగాణలో ఈ ఆటలు సాగక భంగపడిందన్నారు. అందుకే రూ.18 వేల కోట్లతో కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొని ఉప ఎన్నిక తెచ్చిందని మండిపడ్డారు. ఈసీని అడ్డం పెట్టుకొని అక్రమాలు చేస్తున్నదని చెప్పారు. రాజగోపాల్రెడ్డి రాకను బీజేపీ నేతలే సహించడం లేదన్నారు.
బ్రోకర్ బ్రదర్స్: బూడిద భిక్షమయ్య గౌడ్
కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్ట్ బ్రదర్స్గా చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారని మాజీ ఎమ్మె ల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. నల్లగొండ రాజకీయాలను భ్రష్టు పట్టించారని, డబ్బుతో ఏదైనా చేయొచ్చని విర్రవీగుతున్నారన్నారు. జిల్లాలో బడుగు, బలహీన వర్గాల నేతలను రాజకీయంగా నాశనం చేస్తున్నారన్నారు. తనను కూడా చాలా ఇబ్బంది పెట్టారని, తాను బీజేపీలో చేరితే అక్కడికీ వచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు గెలిస్తే నల్లగొండ జిల్లాను రూ.లక్ష కోట్లకు తాకట్టు పెడతారని హెచ్చరించారు. ‘వాళ్లు బ్రోకర్ బ్రదర్స్’ అని, దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పే బీజేపీ.. అలాం టి దొంగలను, రాజకీయ కాంట్రాక్టర్లను ఎం దుకు చేర్చుకొన్నదని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా అంతంచేసిన కోమటిరెడ్డి బ్రదర్స్కి నల్లగొండ జిల్లా ప్రజలు బుద్ధి చెప్పాలని ఒక బీసీ బిడ్డగా కోరుతున్నానన్నారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏమిటా గుజరాత్ రహస్యం?
కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్ట్ రాజకీయం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీతో బేరం కుదిరినంకనే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పార్టీ మారారని విమర్శించారు. ఆయన అన్న వెంకట్రెడ్డి కాంగ్రెస్లో ఉంటూనే తన తమ్ముడిని గెలిపించాలని కాంగ్రెస్ నేతలకు ఫోన్లు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని కేటీఆర్ పేర్కొన్నారు. తనది చిన్న కంపెనీ అని, అప్పులు తెచ్చి నడుపుతున్నానని రాజగోపాల్రెడ్డి అనేకసార్లు చెప్పారని, మరి ఆయన చిన్న కంపెనీకి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఎలా వచ్చింది? ఏమిటా గుజరాత్ రహస్యం? అని నిలదీశారు. నీతి ఆయోగ్ చెప్పినా 19వేల కోట్లు ఇవ్వలేదని, కానీ రాజగోపాల్రెడ్డిని కొనడానికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని రాజగోపాల్రెడ్డే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు.
ఇలాంటి ప్రధానికి బుద్ధి చెప్పాల్సిందే
మా సంకల్పం.. తెలంగాణ బలం
ఫోన్ చేస్తే తప్పేముంది?
తాను బీజేపీ నేతకు ఫోన్ చేసి సహకారం కోరితే తప్పేమున్నదని కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన కూడా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుడే అన్నారు. ‘నేత కార్మికులకు మోదీ మరణ శాసనం రాసిండు. 5% జీఎస్టీ వేసిండు. నేతన్నలు మాతో ఉండండని చెప్పిన. పవర్ లూం బోర్డు రద్దుతో పాటు చేనేత కార్మికులకు మరణశాసనం రాస్తున్న పార్టీని వదిలి రావాలని అడిగిన ఇందులో తప్పేమున్నది. బరాబర్ అడుగుత. మా ప్రభుత్వ పథకాలను పొందుతున్న ప్రతి లబ్ధిదారుడినీ ఓటు అడిగే హకు మాకున్నది. జగన్నాథం కూడా ప్రభుత్వ పథకాలు వస్తున్నయన్నారు’ అని పేర్కొన్నారు. రాజగోపాల్రెడ్డికి కూడా రైతుబంధు వస్తున్నదని, ఆయన కూడా మునుగోడులో ఓటుహక్కు ఉంటే టీఆర్ఎస్కే ఓటేయాలని కోరారు. మునుగోడులోని బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలకు రైతుబంధు, రైతు బీమా, తాగునీరు వస్తున్నాయని, వాళ్లను కూడా ఓట్లు అడుగుతామని, అందులో తప్పేమున్నదని ప్రశ్నించారు. ‘గాశారం బాగలేక టీఆర్ఎస్ను విడిచిపోతున్నారని సీఎం కేసీఆర్ అంటుంటారు. బూర నర్సయ్యగౌడ్ కూడా అలా గాశారం బాగాలేక బీజేపీలో చేరారని అర్థమవుతున్నది. రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయి. అందుకు ఆయన క్లాసిక్ ఎగ్జాంపుల్’ అని పేర్కొన్నారు.