నల్లగొండ, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకొని బీజేపీ హుజూరాబాద్లో కుట్రలకు పాల్పడుతున్నదని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. సామాన్యుల ఇబ్బందులు పట్టని బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెరుగని రోజేలేదని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే బీజేపీ నేతలు వాటిపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్లో గెలుపు టీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తంచేశారు. నల్లగొండలోని తన నివాసంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్ భాస్కర్రావుతో కలిసి శనివారం గుత్తా మీడియాతో మాట్లాడారు. ఓటమి భయంతో బీజేపీ ఘర్షణలకు ప్రేరేపిస్తున్నదని మండిపడ్డారు. గతంలో ఇలా చేసి పశ్చిమబెంగాల్లో బొక్కబోర్లా పడ్డ విషయాన్ని మర్చిపోరాదని హితవు పలికారు.
అభివృద్ధిని ఓర్వలేక పాదయాత్రలు
రాష్ర్టాభివృద్ధిని ఓర్వలేని కొన్ని పార్టీలు కుతంత్రాలతో పాదయాత్రలు, సభల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నాయని గుత్తా ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసినవారే ఇప్పుడు యాత్రల పేరుతో రాష్ట్రంపై విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేని బండి సంజయ్, రేవంత్రెడ్డి యాత్రల పేరుతో మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. 100 శాతం రాయలసీమ డీఎన్ఏ కలిగిన షర్మిల సైతం తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారని, కుటుంబపాలన అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో పంట కొనుగోళ్లు చేస్తున్నదని స్పష్టంచేశారు.