దళితబంధుపై ప్రతిపక్షాలది అసత్య ప్రచారం
పథకం ప్రారంభం కాగానే దళితుల ఖాతాల్లో 10 లక్షలు
జమ్మికుంటలో బంధుపై అవగాహన కల్పించిన మంత్రి కొప్పుల
జమ్మికుంట : బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని, అలాంటి దుర్మార్గమైన పార్టీకి ఇక్కడ స్థానం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. దళితులు ఆర్థికంగా నిలదొక్కునేందుకే దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్నారని తెలిపారు. అలాంటి పథకంపై బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ.. దళితుల కడుపు కొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 11, 27వ వార్డుల్లో పర్యటించిన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దళిత బంధు పథకంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఈ నెల 16వ తేదీన లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం 20 నుంచి 25 రోజుల్లో 20 వేల మంది దళితుల ఖాతాల్లో రూ. 10 లక్షల చొప్పున జమ చేస్తామన్నారు. ఈ పథకంతో నగదు ఖాతాల్లో జమ కాగానే.. బీజేపీ నాయకుల ముఖాలపై తన్నినట్లు అవుతుందన్నారు. దళిత బంధును ఆపేందుకు కుట్రలతో పాటు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరికాదన్నారు.
బీజేపీతో పాటు ఇతర పార్టీల కుట్రలను విచ్ఛిన్నం చేయాలని, పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని మంత్రి కొప్పుల విజ్ఞప్తి చేశారు. దళిత బంధు పథకం అమలుపై ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి ఓటేస్తే అభివృద్ధి పనులు జరగవని, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని మంత్రి కొప్పుల విజ్ఞప్తి చేశారు.