కన్యాకుమారి, సెప్టెంబర్ 7: జాతీయ జెండాపై ఆర్ఎస్ఎస్, బీజేపీ దాడి చేస్తున్నాయని, జెండా వారి వ్యక్తిగత ఆస్తిగా చూస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ దుయ్యబట్టారు. మత, భాషా ప్రాతిపదికన దేశాన్ని విభజిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తమిళనాడులోని కన్యాకుమారి నుంచి బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 5 నెలల పాటు 3,570 కిలోమీటర్ల మేర సాగనున్నది. దేశంలోని ప్రతి వ్యవస్థను ఆర్ఎస్ఎస్, బీజేపీ నాశనం చేస్తున్నాయని, ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలతో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. చరిత్రలోనే ఎన్నడూ చూడనంత దారుణమైన ఆర్థిక సంక్షోభంలో దేశం ఉన్నదని, అదే సమయంలో అత్యధిక నిరుద్యోగిత రేటు ఉన్నదని, దేశం భారీ విపత్తు దిశగా వెళ్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.