వాళ్లకు పథకాలు అందకుండా చూస్తా
మధ్యప్రదేశ్ బీజేపీ నేత బెదిరింపులు
భోపాల్, జూలై 11: విపక్షాలను, ఆ పార్టీలకు మద్దతిచ్చే వారిని ఇబ్బందులకు గురిచేయడం బీజేపీ నేతలకు నిత్యకృత్యంగా మారింది. కమలదళం పాలనాపగ్గాలు వెలగబెడుతున్న మధ్యప్రదేశ్లో జరిగిన ఘటనే ఇందుకు తాజా ఉదాహరణ. రత్లామ్ నగర మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ నేత ప్రహ్లాద్ పటేల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ జెండాలు ఉన్న ఇండ్ల ఫొటోలను తీయాలని కార్యకర్తలకు సూచించారు. ఆ ఇండ్లల్లోని వారికి ప్రభుత్వ పథకాలు, ఇతరత్రా ప్రయోజనాలు దక్కకుండా చూస్తానని హెచ్చరించారు.
ఎన్నికల్లో 5-10 ఇండ్ల ఓట్లు రానంత మాత్రాన తనకేమీ నష్టంలేదని, అయితే అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని తీవ్ర స్వరంతో అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఇది బీజేపీ అహంకారపూరిత వైఖరికి పరాకాష్ట అని కాంగ్రెస్ మండిపడింది. అయితే, తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లడానికి ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ పని చేసినట్టు ప్రహ్లాద్ చెప్పుకొచ్చారు. దీనిపై దర్యాప్తునకు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు.