భోపాల్, సెప్టెంబర్ 20: బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సొంత సర్కారు మీదే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని తన దత్తత గ్రామాల్లో పోలీసులకు లంచం ఇచ్చేందుకు గ్రామస్తులు తమ కూతుళ్లను అమ్ముకుంటున్నారని తెలిపారు. మంగళవారం ఓ కార్యక్రమానికి హాజరైన ప్రజ్ఞా ఠాకూర్ మాట్లాడుతూ, తాను దత్తత తీసుకున్న గ్రామాల్లోని ప్రజలకు జీవనోపాధికోసం ఎలాంటి వనరులు లేవన్నారు. అందుకే వారంతా నాటుసారా కాస్తారని, దాన్ని అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు.
వారిని తరుచూ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని, తమ కూతుళ్లను అమ్ముకొని లంచం ఇచ్చి బయటకొస్తున్నారని ప్రజ్ఞా ఠాకూర్ పేర్కొన్నారు. ఆమె మాట్లాడిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై సమాధానం చెప్పాలని శివరాజ్సింగ్ చౌహాన్ సర్కారును ప్రతిపక్ష కాంగ్రెస్ నిలదీసింది. ‘బేటీ పఢావో-బేటీ బచావో’ అంటే ఇదేనా? అని ప్రశ్నించింది. సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్.. ఈ అంశాన్ని పార్లమెంట్లో ఎందుకు లేవనెత్తలేదని కాంగ్రెస్ నాయకురాలు సంగీతశర్మ ప్రశ్నించారు.