హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో భూకబ్జాలకు ప్రయత్నిస్తున్న రాయలసీమ ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బంజారాహిల్స్లో భూ కబ్జాకు ప్రయత్నించిన కేసులో బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ను 5వ నిందితుడిగా పేర్కొంటూ స్థానిక పోలీసులు కేసు నమోదుచేశారు. టీజీ వెంకటేశ్ ప్రోద్బలంతోనే టీజీ విశ్వప్రసాద్ దౌర్జన్యకాండకు ప్రయత్నించినట్టు బంజారాహిల్స్ పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ కేసులో రాయలసీమ గ్యాంగ్కు చెందిన 58 మందిని ఒకేసారి అరెస్టు చేసిన పోలీసులు సోమవారం రిమాండ్కు తరలించారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. వీరిలో ఒకరు జనసేనకు చెందిన నాయకుడని గుర్తించారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2005లో బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ పార్కుకు స్థలం కేటాయించింది. అక్కడ ఉన్న 2,250 గజాల స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి, కబ్జా చేసేందుకు రాయలసీమ ముఠా ప్రయత్నించింది. ఆ స్థలాన్ని పొజిషన్లోకి తీసుకోవడం కోసం టీజీ విశ్వప్రసాద్ అండ్ కో ఆదోని, మంత్రాలయం, కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన 90 మంది రౌడీలను రప్పించి, దౌర్జన్యకాండకు దిగారు. కాపాలా ఉన్న సిబ్బందిపై దాడి చేశారు. ఈ గ్యాంగ్ దౌర్జన్యం చేసేందుకు వారం రోజుల క్రితం నుంచి వాట్సాప్ ద్వారా చర్చలు నడిపినట్టు పోలీసులు గుర్తించారు.