షిమ్లా : హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లా జిల్లాలోని జుబ్బల్-కోట్ఖైకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీలో చీఫ్విప్ నరేంద్ర బ్రాగ్తా కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు చేతన్ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. గత 15 రోజుల కిందట ఛాతిలో నొప్పి రావడంతో చండీగఢ్ పీజీఐ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. నరేంద్ర బ్రాగ్తా ఏప్రిల్ నెలలో కరోనా బారినపడి కోలుకున్నారు. నరేంద్ర 1952, సెప్టెంబర్ 15న జుబ్బల్-కోట్ఖైలో జన్మించగా.. హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.
1978-82 వరకు జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా, 1993 – 98 వరకు జిల్లా బీజేపీ కార్యదర్శిగా పని చేయగా.. మొదటిసారి 1998 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ 2007లో జుబ్బల్-కోట్ఖాయ్ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. ధుమాల్ ప్రభుత్వంలో హార్టికల్చర్, ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం ఆయన మళ్లీ మూడోసారి 2017లో ఎమ్మెల్యేగా ఎన్నికవగా.. అసెంబ్లీలో చీఫ్ విప్ బాధ్యతను అప్పగించారు. ఆయన మృతిపై జీఎం జై రామ్ ఠాకూర్ సంతాపం తెలిపారు. ఆయన మరణం బీజేపీకి తీరని లోటని పేర్కొన్నారు.