హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను సెషన్ పూర్తయ్యే వరకు సభ నుంచి సస్పెండ్ చేశారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. తండ్రి లాంటి స్పీకర్ గురించి ఈటల అనుచితంగా మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. స్పీకర్కు ఈటల బేషరతుగా క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ సభ్యులు డిమాండ్చేశారు. సభలో వాతావరణాన్ని గమనించిన స్పీకర్.. సభ్యుల కోరిక మేరకు క్షమాపణ చెప్పి చర్చను కొనసాగించాలని ఈటలకు సూచించారు. స్పీకర్కు క్షమాపణ చెప్పడానికి ఈటల నిరాకరించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి జోక్యంచేసుకొని ‘ ఈటల రాజేందర్ సభలో ఉండి మాట్లాలని కోరుకుంటున్నాను.
క్షమాపణ చెప్పి మాట్లాడాలి’ అని కోరారు. దీనికి స్పందించిన ఈటల.. బెదిరిస్తున్నారా?, ఏం చేస్తరు మీరు? అని రెట్టించి ప్రశ్నించారు. అనంతరం మంత్రి వేముల మాట్లాడుతూ.. తాము బెదిరించడం లేదని, ఈటలకు సభలో ఉండాలని లేనట్టున్నదని.. కావాలని సస్పెండ్ చేయించుకొని బయటకు వెళ్లి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలనుకొంటున్నారని అన్నారు. అయినప్పటికీ ఈటల తన వైఖరి మార్చుకోలేదు. స్పీకర్ జోక్యం చేసుకొని సభ మూడ్ అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. స్పీకర్తోపాటు మంత్రి వేముల పదే పదే విజ్ఞప్తి చేసినా ఈటల స్పందించలేదు. దీంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈటల రాజేందర్ను సస్పెండ్ చేయాలని కోరుతూ ప్రతిపాదించారు. సభ్యులు ఈటల సస్పెన్షన్కు మద్దతు తెలుపడంతో స్పీకర్ ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు.
విధిలేని పరిస్థితుల్లోనే సస్పెన్షన్
వయసుతోపాటు అపార అనుభవం ఉన్న స్పీకర్ను ఉద్దేశించి ఈటల రాజేందర్ అనుచితంగా మాట్లాడటం చాలా బాధాకరమని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఈటల మాటలు సరికాదని చెప్తూ తక్షణం సభాపతికి క్షమాపణ చెప్పాలని కోరినట్టు గుర్తుచేశారు. స్పీకర్ నాలుగుసార్లు, మంత్రిగా తాను ఐదుసార్లు ఈటలను రిక్వెస్ట్ చేశామని చెప్పారు. సారీ చెప్పమని చీఫ్ విప్ వినయ్భాస్కర్ అడిగినా ఈటల పట్టించుకోలేదని, విధిలేని పరిస్థితుల్లోనే చైర్ గౌరవాన్ని కాపాడేందుకు సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నామని మంత్రి సభకు వివరించారు.