బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యెడియూరప్ప రాజీనామా చేయడంతో.. ఇప్పుడు కొత్త సీఎంపై అందరి దృష్టి నెలకొన్నది. మరో వైపు ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పార్టీ సీనియర్ నేత బీఎల్ సంతోష్, కర్ణాటక ఇన్చార్జి అరుణ్ సింగ్ సమావేశమై కొత్త సీఎం ఎంపికపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు బెంగళూరులో సీఎం ఎంపికపై ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రానికి పరిశీలకులను పంపనున్నట్లు పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి.
పరిశీలకులుగా కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు చెప్పాయి. పరిశీలకులు ఎమ్మెల్యేలతో సమావేశమై, అభిప్రాయాలను సేకరించిన తర్వాత గురువారం జరిగే శాసన సభపక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశం ఉంది. పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని, ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు రెండు మూడు రోజులు పడుతుందని బీజేపీ కర్ణాటక నేతలు నళిన్కుమార్, అరుణ్సింగ్ పేర్కొన్నారు. ఎంపిక పూర్తయితే గురువారమే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.