హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఏ రాజకీయ పార్టీ అయినా.. ఎన్నికలు వస్తే చేసింది, చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తాయి. కానీ బీజేపీ నాయకులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఒకరితో మరొకరు పోటీపడి సభలు, సమావేశాల్లో నోరు పారేసుకుంటూ బూతుల జనతా పార్టీగా మార్చేశారు. ప్రత్యర్థి పార్టీ నేతలను నానా దుర్భాషలాడుతున్నారు. పోలింగ్ సమయం దగ్గరపడుతున్నకొద్దీ కాషాయ పార్టీ నేతలు కవ్వింపులకు దిగు తూ.. అన్పార్లమెంటరీ పదాలు వాడుతూ టీఆర్ఎస్ నేతలను రెచ్చగొట్టే ప్రయత్నంచేస్తున్నారు. స్థాయి మరచి ఏకంగా సీఎం కేసీఆర్పైనే అవాకులు చవాకులు పేలుతున్నారు. ఏదో ఒకటి చేసి రాజకీయంగా లబ్ధిపొందాలని నీచమైన స్థాయికి దిగజారుతున్నారు.
రాజ్యాంగబద్ధమై ఎంపీ హోదాలో ఉంటూ బండి సంజయ్, అర్వింద్, ఎమ్మెల్యేగా ఉం టూ రఘునందన్రావు ఎన్నికల్లో లబ్ధికోసం నోరు పారేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై అక్కడి ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలకు దిగుతున్నాయి. కానీ తెలంగాణలో మంత్రులను, స్వయంగా సీఎంను వ్యక్తిగతంగా దూషించినా చర్యలకు ఉపక్రమించకుండా సహనంగా ఉంటున్నారు. మహారాష్ట్రలో కేంద్ర మంత్రి నారాయణ్రాణే చెప్పుతో కొట్టాలన్న వ్యాఖ్యలు చేయగానే అక్కడి సీఎం ఉద్దవ్ ఠాక్రే వెంటనే అరెస్ట్చేయించారు. తెలంగాణలోనూ ఇలా చర్యలు తీసుకోవడం మొదలు పెడితేనే బీజేపీ నాయకులు దారికొస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గెలుపు కోసం కవ్వింపు చర్యలు
వ్యక్తిగత దూషణలకు పాల్పడటం బీజేపీ నేతలకు ఒక ప్రణాళికగా మారింది. గత ఎన్నికల సందర్భంలోనూ ఇలాంటివి చేసి ప్రజల్లో చులకనయ్యారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నకొద్దీ బీజేపీ నాయకులు ఒకరి తర్వాత మరొకరు స్వరం పెంచి కవ్విస్తున్నారు. వ్యక్తిగతంగా మాటలతో దాడిచేయడం, అవహేళన చేసేలా, వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రస్తావించడం, బూతులు తిట్టడం ఇందులో భాగంగా ఉంటున్నది. ఎన్నికలు జరిగే ప్రాంతాలకు వెళ్లి తమ అభ్యర్థిని గెలిపించాలని కోరడం బదులు, ఇతర పక్షాల అభ్యర్థులపై, నాయకులపై నోరు పారేసుకుంటారు.
అక్కడి శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టి అంతో ఇంతో ఓట్లు దండుకోవాలని చూస్తుంటారు. సామాన్యుడితోనూ మర్యాదగా మాట్లాడే మంత్రి హరీశ్రావును సైతం బీజేపీ నేతలు లక్ష్యంగా చేసుకొని నానా దుర్భాషలాడటం టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆగ్రహాన్ని రగిలిస్తున్నది. ప్రస్తుతం హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా బీజేపే నేతలు మళ్లీ అదే ప్రణాళిక అమలుచేయాలని ప్రయత్నించి ప్రజల్లో మరోసారి చులకనవుతున్నారు.