హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): అప్పర్భద్ర ప్రాజెక్టుపై కేంద్రం నిస్సిగ్గుగా అసత్యాలు పలికింది. లోక్సభలో గురువారం టీఆర్ఎస్ ఎంపీలు రంజిత్రెడ్డి, మాలోత్ కవిత, వెంకటేశ్నేత, పసునూరి దయాకర్ కేంద్ర జల్శక్తిశాఖకు పలు ప్రశ్నలు సంధించారు. కర్ణాటక చేపట్టిన అప్పర్భద్రకు టీఏసీ అనుమతులున్నాయా? ఉంటే దేని ఆధారంగా ఇచ్చారు? వాటిపై తెలంగాణ, ఏపీ రాష్ర్టాల అభిప్రాయాన్ని, అంగీకారాన్ని తీసుకొన్నారా? పర్యావరణ, అటవీశాఖ అనుమతులున్నాయా? తెలియజేయాలని కోరారు. అప్పర్భద్రకు అన్ని అనుమతులున్నాయని, నదీపరివాహక రాష్ర్టాల అనుమతి ఉందని కేంద్ర మంత్రి తుడు చెప్పటం నిపుణులను విస్మయానికి గురిచేస్తున్నది. అప్పర్భద్ర, అప్పర్తుంగ ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని బచావత్ ట్రిబ్యునల్1 ఎదుట కర్ణాటక ప్రతిపాదించింది. కృష్ణాకు తుంగభద్ర బేసిన్ నుంచే నీరు రావాల్సి ఉన్నదని, తుంగభద్రపై ప్రాజెక్టులను నిర్మిస్తే ఆ బేసిన్ నుంచి కృష్ణాకు నీటి రాక తగ్గిపోతుందని ట్రిబ్యునల్ తెలిపింది. దిగువన ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ ఆ ప్రాజెక్టులకు కేటాయింపులు చేయలేదు. బచావత్ ట్రిబ్యునల్ 1 మార్గదర్శకాల మేరకు అప్పర్భద్రకు 9, అప్పర్ తుంగకు 11 టీఎంసీల నీటిని బ్రిజేశ్ ట్రిబ్యునల్2 కేటాయించింది. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్నది. కానీ, అప్పర్భద్రకు ట్రిబ్యునల్1 నీటి కేటాయింపులు చేసిందని కేంద్రం చెప్పటం గమనార్హం.
అంతర్రాష్ర్టాల అభ్యంతరాలు బుట్టదాఖలు
ఒక ప్రాజెక్టును చేపట్టాలంటే నదీ పరివాహక రాష్ర్టాల అంగీకారం తప్పనిసరి. కానీ, కర్ణాటక అంగీకారం తీసుకోకపోగా, ఆ రాష్ట్ర సర్కారే సొంతంగా అప్పర్భద్ర, అప్పర్తుంగలకు నీటి కేటాయింపులు చేసుకొన్నది. అందుకు ఆ రాష్ట్ర సర్కారును మందలించాల్సిందిపోయి.. అప్పర్భద్రకు ఏకంగా జాతీయ హోదా ప్రకటించడం గమనా ర్హం. ఏపీ, తెలంగాణ అభ్యంతరాలపై సమాచారాన్ని ఇరు రాష్ర్టాలకు ఇచ్చినట్టు మరో అబద్ధాన్ని వల్లె వేసింది. నిబంధనలకు విరుద్ధంగా అప్పర్భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులకు అనుమతులెలా ఇస్తారని సీడబ్ల్యూసీని తెలంగాణ నిలదీసింది. ప్రాజెక్టుల అనుమతులను నిలిపేయాలంటూ అనేక లేఖలు రాసింది. ట్రిబ్యునల్ 1 అవార్డులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రాజెక్టులకు అనుమతిలివ్వడం సరికాదని సూచించింది. కానీ, ఇప్పటికీ తెలంగాణ లేవనెత్తిన ఒక్క అంశంపైనా కేంద్రం నుంచి జవాబు రాలేదు. అయినా.. తెలంగాణ ప్రశ్నలకు జవాబిచ్చామని కేంద్ర మంత్రి చెప్పటం కొసమెరుపు.
అడుగడుగునా బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు
1974 బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు మళ్లిస్తే, నాగార్జునసాగర్ ఆయకట్టుకు అందజేస్తున్న నీటిలో 45 టీఎంసీలు పూర్తిగా తెలంగాణకే దక్కాలి. కానీ, ఆ జలాలను వినియోగించుకొనేందుకు కేంద్రం ఇప్పటికీ తెలంగాణకు అనుమతివ్వటం లేదు. ఇటు.. నాలుగేండ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వకుండా తొక్కిపెడుతున్నది. ఇలా ద్వంద్వ నీతి ప్రదర్శిస్తున్న బీజేపీపై తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం తీరు సిగ్గు చేటు:
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎన్నికల్లో గెలుపు కోసం నిబంధనలను తుంగలో తొక్కుతున్నది. జాతీయ హోదా ప్రమాణాలకు సరితూగకున్నా, ట్రిబ్యునల్ కేటాయింపులు లేకున్నా బీజేపీ పాలిత రాష్ర్టాల ప్రాజెక్టులకు జాతీయ హోదాను ప్రకటిస్తున్నది. ఇందుకు కర్ణాటకలో ని అప్పర్భద్ర, యూపీలోని కెన్ బెత్వా ప్రాజెక్టులే నిదర్శనం. వాటి అనుమతులపై పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పటం సిగ్గుచేటు. కాళేశ్వరానికి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వకుండా, తిరిగి అదే సాకుతో జాతీయ హోదా ఇవ్వలేమని బుకాయిస్తున్నది. ఆ పార్టీకి గుణపాఠం తప్పదు. – ఎంపీ రంజిత్రెడ్డి
నయీ మంజిల్ పథకం కింద రూ.20.64 కోట్లు
ఎంపీ రంజిత్రెడ్డి ప్రశ్నకు స్మృతి ఇరానీ జవాబు
నయీ మంజిల్ పథకం కింద తెలంగాణలో 5,945 మంది డ్రాపౌట్ విద్యార్థులు లబ్ధి పొందినట్టు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. గురువారం లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. 5,945 మందిలో దాదాపు 5,607 మంది ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టైలర్ వంటి ఉద్యోగాల్లో శిక్షణ తీసుకొని సర్టిఫికెట్ పొందారని వెల్లడించారు. స్కూల్ డ్రాపౌట్లకు సాఫ్ట్ స్కిల్స్, బేసిక్ ఐటీ, ఇంగ్లిష్తోపాటు నైపుణ్య కోర్సుల్లో 3 నెలలపాటు శిక్షణ ఇచ్చామన్నారు. ఈ విషయంలో తెలంగాణకు రూ.33.59 కోట్లు మంజూరుచేశామని.. ఇప్పటివరకు రూ.20.64 కోట్లు విడుదలచేశామని వివరించారు.