అయోధ్య, ఆగస్టు 7: అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వీలుచిక్కినప్పుడల్లా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న బీజేపీ నేతలు ఆ పవిత్ర స్థలంలోనే భూదందాకు తెగబడ్డారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి కోర్టు తీర్పు సానుకూలంగా వస్తుందని ముందే పసిగట్టి ఆక్రమణల పర్వానికి తెరతీశారు. మందిర నిర్మాణం జరిగాక అయోధ్యలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతాయని గ్రహించారు. అంతే రాత్రికి రాత్రి ప్రభుత్వ భూములను కబ్జా చేయడం ప్రారంభించారు. కోట్లు విలువజేసే ఈ భూముల్లో దొడ్డిదారిన కాలనీలు నిర్మించారు. ఆ అక్రమ కట్టడాలను అమాయక ప్రజలకు అంటగట్టారు.
ఈ కుంభకోణంలో బీజేపీ ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా, సిటీ మేయర్ రిషికేశ్ ఉపాధ్యాయ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే గోరఖ్నాథ్ బాబాతో సహా కమలదళానికి చెందిన దాదాపు 40 మంది నేతలు ఉన్నారు. ఈ మేరకు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ (ఏడీఏ) ఆరోపించింది. అక్రమార్కుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. ‘జాబితాలోని 40 మంది వ్యక్తులు అథారిటీ, ప్రభుత్వానికి చెందిన భూములను కబ్జా చేసి దొడ్డిదారిన విక్రయించారు.
ఇప్పుడు ఆ స్థలంలో మరికొన్ని నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి’ అని ఏడీఏ వైస్ ఛైర్మన్ విశాల్ సింగ్ అన్నారు. అక్రమాలకు పాల్పడిన 40 మందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆరోపణలపై ఉపాధ్యాయ్, గుప్తా స్పందించారు. తమను తప్పుడు కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతున్నదని మండిపడ్డారు. రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన తర్వాత అయోధ్య ఆలయం, నగరాభివృద్ధిని పర్యవేక్షించే క్రమంలో ఏడీఏను ఏర్పాటు చేశారు. కాగా సిటీ మేయర్ రిషికేశ్ ఉపాధ్యాయ్ ఆరెస్సెస్ అనుబంధ సంస్థ విశ్వహిందూ పరిషద్ (వీహెచ్వీ)కి చెందిన వ్యక్తిగా తెలుస్తున్నది.
ల్యాండ్ మాఫియాతో కుమ్మక్కు
బీజేపీ నేతల భూదందాపై సమాజ్వాదీపార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ విరుచుకుపడ్డారు. అవినీతిలో కూరుకుపోయిన బీజేపీ నాయకులు.. కనీసం అయోధ్యనైనా విడిచిపెట్టాలని ఎద్దేవా చేశారు. ‘ల్యాండ్ మాఫియా, ప్రభుత్వంలోని కొన్ని విభాగాలతో కుమ్మక్కై బీజేపీ మేయర్, స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్యెల్యే కలిసి 30 వరకు అక్రమ కాలనీలను నిర్మించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు వందలాది కోట్ల నష్టం వాటిల్లింది. ఈ అంశాన్ని లోతుగా దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలి’ అని ఎస్పీ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఇటీవలి యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ భూదందాపై విపక్ష పార్టీలు పలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ వివాదంపై సిట్తో దర్యాప్తు చేయించాలని స్థానిక ఎంపీ లల్లూ సింగ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు లేఖ కూడా రాశారు.
వెలుగులోకి వచ్చింది ఇలా..
అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేత డ్రైవ్ను ఇటీవల ఏడీఏ చేపట్టింది. ఏడీఏ భూముల్లో అక్రమ కాలనీలు ఉన్నట్టు గ్రహించిన అధికారులు వాటిని కూల్చడానికి యత్నించారు. అయితే, తాము డబ్బులు చెల్లించి ఇండ్లను కొనుగోలు చేశామని స్థానికులు మునిసిపల్ ట్యాక్సులు, ఇంటి పత్రాలను అధికారులకు చూపెట్టారు. దీంతో భూదందా బాగోతం బయటపడింది.
‘సుప్రీం’ తీర్పు నేపథ్యంలో గద్దల్లా..
రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు, అయోధ్యను జిల్లాగా మార్చుతూ యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ టెంపుల్ టౌన్లో భూముల రేట్లు ఆకాశాన్నంటాయి. మందిరానికి అనుకూలంగా కోర్టు తీర్పు రానున్నదని ముందుగానే గ్రహించిన రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్లు, వారి బంధువులు అయోధ్య శివారుల్లో పెద్దయెత్తున భూముల్ని కొనుగోలు చేశారు. బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఏడీఏ, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు.