చెన్నై, ఆగస్టు 14: రాజకీయ లబ్ధి కోసం బీజేపీ దేశభక్తి కార్డును వాడుకుంటున్నదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. 75వ స్వాతంత్ర దినోత్సవాలను కూడా బీజేపీ రాజకీయ మైలేజీ కోసం వాడుకుంటున్నదని దుయ్యబట్టారు. మధురైలో తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ కారుపై బీజేపీ నేతలు చెప్పులు విసిరిన ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. ఆ కారు బానెట్పై జాతీయ జెండా కూడా ఉన్నదని చెప్పారు. జాతీయ జెండాను బీజేపీ నేతలు తీవ్రంగా అవమానపరిచారంటూ నిప్పులు చెరిగారు. కారుపై దాడులు చేసిన వారు 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను తీవ్రంగా అవమానించినట్టేనని, దీన్ని బట్టి బీజేపీ నేతల దేశభక్తి నకిలీదనేది తేలిపోయిందని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై పబ్లిసిటీ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.