న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి మధ్య పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటగా.. సామాన్యులు పెరిగిన ఇంధన ధరలతో బెంబేలెత్తుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రశ్నించిన మీడియాపై మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు కావాలంటే తాలిబన్ పాలిత ప్రాంతానికి వెళ్లండి.. అక్కడ చౌకగా పెట్రోల్ దొరుకుతుంది’ అంటూ మండిపడ్డారు.
పెరిగిన పెట్రోల్ ధరలపై కట్నీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామ్రతన్ పాయల్ను ప్రశిస్తే.. ‘తాలిబన్ పాలిత ప్రాంతానికి వెళ్లిపో. అక్కడ పెట్రోల్ రూ.50కే దొరుకుతుంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ దేశంలో కరోనా రెండు వేవ్లో వచ్చాయని.. మూడో వేవ్ రాబోతుందన్నారు. దేశంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో మీకు తెలుసా? అంటూ ఎదురు ప్రశ్నించారు. బీజేపీ నేత తీరుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బీజేపీ నేతల వాక్చాతుర్యం కొనసాగుతుందని.. వారికి దేవుడు జ్ఞానం ఇవ్వాలని పేర్కొంది. ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.84 ఉండగా.. డీజిల్ ధర రూ.89.27 పలుకుతోంది.