విశాఖ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మూడున్నరేండ్లుగా దోపిడీ తప్పా మరో ఆలోచనేదీ లేదని బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇసుక, లిక్కర్, గనులు సహా అన్నింటినీ జగన్ మింగేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ పార్లమెంట్ జిల్లా శాఖ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
చెత్తపై కూడా పన్నులేసి దోచుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఈయన కళ్లకు పేదలు అసలే కనిపించరని, వారి సంక్షేమం అసలే పట్టదని ఆయన అన్నారు. గతంలో ఇసుక మాఫియా చెలరేగిపోయిందని వీధివీధి తిరిగి ప్రచారం చేసిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తుందేంటో చెప్పాలన్నారు. ఇసుకలో అవినీతి జరుగుతున్నదని తెలుసుకోవడానికి సీఎంకు ఆర్నెళ్ల సమయం పట్టిందని, ఈ ఆర్నెళ్ల పాటు భవన నిర్మాణ కార్మికులు దాదాపు 50 లక్షల మంది బజారున పడ్డా పట్టించుకోలేదని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను గాలికొదిలేసిన జగన్.. రాజధాని ఏర్పాటు అంశంతో మూడు ముక్కలాట ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని, ఇప్పుడు ఉపాధి కూడా కరవైన పరిస్థితులు ఉన్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసిన కన్నా లక్ష్మీనారాయణ.. డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.