జమ్మికుంట : ‘బీజేపీ మతతత్వ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే ఆ పార్టీకి పడదు. పూర్తిగా వ్యతిరేకం. ఆ పార్టీకి ఓటేస్తే హుజూరాబాద్ ప్రజలు నష్టపోతరు. టీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీ. అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని కాపా డుకుంటంది. సీఎం కేసీఆర్ అన్ని కుల, మతాలకు సముచిత స్థానం అందిస్తున్నడు. సంక్షేమంలో అందరికి పెద్దపీట వేస్తున్నడు. ప్రశాంతమైన వాతావరణంలో పాలన సాగుతోంది. మరోసారి టీఆర్ఎస్ కే ఓటేయ్యాలే.
ఉద్యమ నాయకుడు, గరీబు బిడ్డ గెల్లు సీనును గెలిపించుకోవాలే. హుజూరాబాద్ మరింత అభివృద్ధిని సాధించాలి.’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 17,21వ వార్డుల్లో పర్యటించారు. ఇంటింటికీ తిరిగారు. అలాగే 21వ వార్డు మేన్ రోడ్డులో ఉన్న షాపుల్లోని నిర్వాహకులను కలిశారు. నమూనా ఈవీఎంను పంపిణీ చేశారు. అందులోని కారు గుర్తును చూపారు.
ఈ నెల 30న జరిగే పోలింగ్లో కారు గుర్తు గెల్లు శ్రీనివాస్ యాదవ్కే ఓటేయ్యాలని అభ్యర్థించారు. తర్వాత 17వ వార్డులో తిరిగారు. ఈ సందర్భంగా కాలనీలోని క్రిస్టియన్లు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. టీఆర్ఎస్ కే ఓటేస్తామని చెప్పారు. ప్రచారంలో భాగంగా ఆయా కాలనీల్లో స్థానిక ప్రజలతో ముచ్చటించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద దాడులు, హత్యలు చేస్తున్నదని ఆరోపించారు.
నల్ల చట్టాలు రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులపై కార్లెక్కించి చంపేస్తున్నదన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులను ఉగ్రవాదులుగా చూస్తున్నదని పేర్కొన్నారు. ఇలాంటి పార్టీలో చేరిన ఈటల రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, మతతత్వ బీజేపీ పార్టీ నుంచి ప్రజల కోసం ఏం చేస్తడని ప్రశ్నించారు. రెండుసార్లు మంత్రిగా ఉండి కూడా ఇక్కడి ప్రజల కోసం ఎలాంటి పనులు చేపట్టక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుపేదల కోసం ఒక్క ఇళ్లు నిర్మించ లేని, సోయిలేని ఈటలకు, ఇక్కడ స్థానం లేకుండా చేయాలని కోరారు. బీజేపీతో నిత్యం అభద్రతాభావంతో బతికే అవకాశాలుంటాయని తెలిపారు. టీఆర్ఎస్ ఒక్కటే రాష్ట్రానికి శ్రీరామరక్షని చెప్పారు. స్వరాష్ట్రంలో క్రిస్టియన్లను ఆదుకుంటున్న సందర్భాలను వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పండుగలకు బట్టల పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
గడిచిన ఐదు నెలల్లో జమ్మికుంటకు రూ.60కోట్లు సీఎం ఇచ్చారని, అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని పేర్కొన్నారు. సంక్షేమం.. అభివృద్ధి ఇదే విధంగా సాగాలంటే కారు గుర్తుకు ఓటేసి గెల్లును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తమ భద్రత, సంక్షేమానికి సముచిత స్థానం కల్పిస్తున్న సీఎం కేసీఆర్ వెంటే నడుస్తామని మంత్రితో.. క్రిస్టియన్లు, కాలనీవాసులు, షాపుల యజమానులు తెలిపారు. సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
అరే ఛాయ్… తాగు భాయ్…….
మంత్రి కొప్పుల ఈశ్వర్, తదితరులు ఉదయం నుంచి మండుటెండలో ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరిగారు. దుకాణా ల్లోని యజమానులతో మాట్లాడారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోసం ఓటును అభ్యర్థించారు. ఇదే సమయంలో ఆర్వోబీ కిందకు వచ్చారు. సేద తీరే ప్రయత్నంలో అమాత్యుడికి ఆర్వోబీ కింద టీకొట్టు కనిపించింది. ఒక్కసారిగా మంత్రి ‘అరే ఛాయ్.. ఇక్కడుంది. తాగుదాం..’అంటూ నాయకులను తీసుకెళ్లారు.
‘ఛాయ్.. తాగు భాయ్..’ అంటూ నాయకులకు, ఓటర్లకు అమాత్యుడు అందించారు. మంత్రే స్వయంగా టీ అందించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రితో పాటు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, ఆయా వార్డులకు చెందిన కౌన్సిలర్లు మల్లయ్య, శ్రీనివాస్, టీఆర్ఎస్ అర్బన్శాఖ అధ్యక్షుడు రాజ్కుమార్, పాస్టర్లు ఆనందయ్య, అశోక్, నాయ కులు, తదితరులున్నారు.