ఎన్నికల సమయాల్లో వివాదాస్పద అంశాలను తెరపైకి తీసుకొచ్చి రాజకీయ లబ్ది పొందాలనుకొనే బీజేపీ ఎత్తుగడలను ఓటర్లు కనిపెట్టారా? పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ.. లక్షలాది ఖాళీలు ఉన్నప్పటికీ, ఉద్యోగాల భర్తీని చేపట్టని కమలదళం కపటబుద్ధిని పసిగట్టారా? అందుకేనా రెండు సిట్టింగ్ స్థానాలు కూడా దక్కనీయకుండా.. పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ బీజేపీకి ఘోర పరాజయాన్ని కట్టబెట్టారా? తాజాగా విడుదలైన నాలుగు రాష్ర్టాల ఉప ఎన్నికల ఫలితాలను చూస్తే ఇదే అనిపిస్తున్నది. ఎన్నికల్లో ఓటమికి బీజేపీ అతీతమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు. కమలదళం అజేయమైన పార్టీ ఏమీకాదని చెబుతున్నారు.
పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, బీహార్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం మూటగట్టుకున్నది. ఒక లోక్సభ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు గానూ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో బీజేపీ అజేయమేమీ కాదని, ఓటమికి అతీతమేమీ కాదనే విషయం మరోసారి స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తమ కష్టాలను తీర్చగల భరోసా కోరుకుంటున్నారు. అయితే ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం దేశంలో సరైన ప్రత్యామ్నాయ బలమైన ప్రతిపక్షం లేకపోవడం బీజేపీకి ఒక అవకాశంలా మారిందని చెబుతున్నారు. అదేవిధంగా సరిగ్గా ఎన్నికల సమయంలో పలు అంశాలను ముందుకు తీసుకొచ్చి సమాజంలో విభజన, మతచిచ్చు రేపడం ద్వారా ఆ పార్టీ లబ్ధి పొందుతున్నదని పేర్కొంటున్నారు. ప్రతిపక్షాలు క్యాడర్ను సమీకరించి గట్టిగా పోరాడితే మతతత్వ, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని గద్దె దింపొచ్చని అభిప్రాయపడుతున్నారు.
భారీగా పడిపోయిన ఓట్ల శాతం
ధరాఘాతంతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న బీజేపీకి ఓటర్లు ఉప ఎన్నికల్లో కర్రు కాల్చి వాతపెట్టారు. బెంగాల్లోని సిట్టింగ్ ఎంపీ స్థానమైన అసన్సోల్లో 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలైంది. 2019 ఎన్నికల్లో ఇదే స్థానంలో బీజేపీ 6.3 లక్షల మేర ఓట్లు సాధించగా, ప్రస్తుతం 3.5 లక్షల ఓట్లకు పడిపోయింది. ఓట్ల శాతం 51 నుంచి 30కి దిగజారింది. బాలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కేయ ఘోష్కు 13% ఓట్లే పడ్డాయి. ఇక్కడ కమలం పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. పై రెండు స్థానాల్లో టీఎంసీ విజయం సాధించింది. మహారాష్ట్ర, చత్తీస్గఢ్లోని కొల్హాపూర్ నార్త్, ఖైరాగఢ్లో బీజేపీ అభ్యర్థులు భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీహార్లోని బొచహాన్లో ఆర్జేడీ చేతిలో 36 వేలకు పైగా ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు.
ఇలాంటి ఫలితాలే వస్తాయ్
పశ్చిమబెంగాల్ ఉపఎన్నికల్లో ఓటమి రాష్ట్ర బీజేపీలో లుకలుకలకు దారితీసింది. ఆ పార్టీకి చెందిన నేతలే రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ ఎంపీ సౌమిత్రాఖాన్ రాష్ట్ర పార్టీ అగ్రనేతలపై విమర్శల తుపాకీ ఎక్కుపెట్టారు. ‘అనుభవం లేని వారు పార్టీని నడిపితే ఇటువంటి ఫలితాలే వస్తాయి. అందుకే తగిన మూల్యం చెల్లించాం’ అంటూ తన అసంతృప్తిని వెళ్లగక్కారు.