సత్యం, శాంతి, అహింసా మార్గాలతో భారతావనికి స్వేచ్ఛా వాయువులను ప్రసాదించిన జాతిపిత మహాత్మాగాంధీ నివసించిన ‘సబర్మతి ఆశ్రమం’ తన పూర్వ వైభవాన్ని కోల్పోనున్నది. పునరభివృద్ధి ప్రాజెక్టు పేరిట గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహాత్ముడు నడయాడిన నేలను శల్యం చేయబోతున్నది. అందుకే గాంధేయ వాదులు, చరిత్రకారులు, హక్కుల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ‘సబర్మతి రీ-డెవలప్మెంట్ ప్రాజెక్టు’కు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ధర్మాలు, నిరసనలు చేపడుతున్నారు.
గుజరాత్లో అహ్మదాబాద్లోని సబర్మతి నది ఒడ్డున 100 ఎకరాల సువిశాల స్థలంలో సబర్మతి ఆశ్రమం విస్తరించింది. మహాత్ముడు తన జీవిత కథను అక్షరీకరించిన పవిత్ర స్థలమిది. ఉప్పు సత్యాగ్రహం వంటి కీలక ఉద్యమాలకు ఇక్కడే అంకురార్పణ జరిగింది. ఉద్యమకాలంలో గాంధీజీ, ఆయన సతీమణి కస్తూర్బా.. 13 ఏండ్లపాటు ఇక్కడే నివసించారు. అయితే, చారిత్రక ప్రదేశాలను ఆధునీకరిస్తున్నామన్న పేరుతో.. గుజరాత్ సర్కారు రూ. 1,200 కోట్లతో ‘సబర్మతి రీ-డెవలప్మెంట్ ప్రాజెక్టు’ను చేపట్టింది. పునరుద్ధరణలో భాగంగా.. 35 ఎకరాల్లో ఉన్న 65 వారసత్వ నిర్మాణాలను తరలిస్తారు. ఆశ్రమ ప్రాంగణంలో మ్యూజియం, గాంధీ థీమ్ పార్క్, ఫుడ్ కోర్టులు, షోలు, పార్కింగ్ స్లాట్లు నిర్మించనున్నారు.
నిరసనలు ఎందుకు?
మహాత్ముడు నిరాడంబరంగా జీవించిన ఆశ్రమాన్ని పునరుద్ధరణ పేరిట ధ్వంసం చేయడానికి, ఆశ్రమ పవిత్రతను చెడగొట్టడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకున్నదని చరిత్రకారులు మండిపడుతున్నారు. రీ-డెవలప్మెంట్ పనులను మహాత్ముడి రెండో హత్యగా అభివర్ణిస్తున్నారు. గాంధీజీ వాడిన వస్తువులను, అక్కడి నిర్మాణాలను తరలిస్తున్నట్టు ఆరోపించారు. 1960లో ప్రఖ్యాత శిల్పి కాంతిపటేల్ చెక్కిన మహాత్ముడి శిల్పం ఆశ్రమానికే తలమానికంగా ఉన్నదని, ఇప్పుడు ఆ విగ్రహాన్ని కూడా తరలిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాళ్లను వెళ్లగొట్టేందుకేనా?!
సబర్మతి ఆశ్రమ ప్రాంతంలో గత శతాబ్దకాలంగా దళిత వర్గానికి చెందిన దాదాపు 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆశ్రమ ప్రాంగణాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ.. ప్రస్తుతం వారి వారసులు ఆ కుటీర పరిసరాల్లోనే నివసిస్తున్నారు. అయితే, ‘సబర్మతి రీ-డెవలప్మెంట్ ప్రాజెక్టు’ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక్కడి కుటుంబాలను బలవంతంగా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికోసం ఒక్కో కుటుంబానికి రూ.40 లక్షల పరిహారాన్ని ఇస్తామని ఆశ చూపినట్టు సమాచారం.